
అనిగండ్లపాడులో ఉద్రిక్తత
● ఉపాధి పనులపై విచారణ సమయంలో కూలీల ఆందోళన ● ఏపీడీ కారును అడ్డగించి నిరసన
అనిగండ్లపాడు(పెనుగంచిప్రోలు): స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం ఉపాఽధిహామీ పనులపై నిర్వహించిన విచారణ ఉద్రిక్తతకు దారితీసింది. ఉపాధిహామీ పనులకు రాని వారికి వచ్చినట్లు హాజరు నమోదు చేశారని, గతంలో చేసిన విచారణ సరిగా లేదంటూ గ్రామానికే చెందిన గింజుపల్లి వేణు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీడీ ఎన్. శ్రీనివాసరావు, ఏపీఓ ఎన్. జనార్దనరావు మరోసారి విచారణ నిర్వహించారు. దీనిలో భాగంగా పెద్ద సంఖ్యలో వచ్చిన కూలీలు తాము అందరూ పనిచేస్తేనే కూలీ డబ్బులు వచ్చాయన్నారు. ఎఫ్ఏగా రమణ పనిచేసిన సమయంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, అతనినే తిరిగి ఎఫ్ఏగా నియమించాలన్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇక్కడకు రావాలని కూలీలు పట్టుబట్టి పంచాయతీ కార్యాలయం వద్ద బైఠాయించారు. అధికారులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. మహిళా మేట్లకు వేణు ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమయంలో చేసేది లేక విచారణాధికారి ఏపీడీ శ్రీనివాసరావు కారులో వెళ్లిపోతుండగా కూలీలు అడ్డుకున్నారు. దీంతో ఆయన మళ్లీ పోలీసుల మధ్య పంచాయతీ కార్యాలయంలోకి వెళ్లారు.
పోలీసులు సర్దిచెప్పడంతో..
విషయం తెలుసుకున్న ఎస్ఐ ఎంఎస్కే అర్జున్ సంఘటనా స్థలానికి వచ్చి కూలీలతో మాట్లాడారు. విచారణ నిర్వహించటానికే అధికారులు వచ్చారని, అధికారులు అందరి దగ్గర నుంచి లిఖిత పూర్వకంగా అర్జీలు తీసుకున్నారన్నారు. విచారణ జరుగుతున్న సమయంలో ఆందోళన తగదన్నారు. మీకు సమస్య ఏమైనా ఉంటే ఫిర్యాదు చేయాలన్నారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఉన్నతాధికారులకు నివేదిస్తాం..
దీనిపై ఏపీడీని వివరణ కోరగా వేణు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేశామని, గ్రామంలో మొత్తం 40 గ్రూపులు ఉంటే 22 గ్రూపుల వారు తాము పనిచేస్తేనే డబ్బులు ఖాతాలో జమయ్యాయని లిఖిత పూర్వకంగా తెలియజేశారన్నారు. సామాజిక తనిఖీలో భాగంగా ఎఫ్ఏ నుంచి 2023–24కు సంబంధించి రూ.3లక్షల వరకు రికవరీ చేయాలని ప్రతిపాదించామన్నారు. ప్రస్తుతం అతన్ని సస్పెండ్ చేసి వేరొకరిని ఎఫ్ఏగా నియమించామన్నారు. విచారణ సమగ్రంగా నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని చెప్పారు. పంచాయతీ కార్యదర్శి పి. సునీల్ కుమార్ తదితరులు ఉన్నారు.