
యోగాతో మానసిక ప్రశాంతత
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మానసిక ప్రశాంతత ద్వారానే ప్రమాద రహిత, సురక్షితమైన ప్రయాణం చేయగలుగుతామని, అందుకు యోగా మంచి సాధనమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. బుధవారం బీఆర్టీఎస్ రోడ్డులోని శారదా కళాశాల జంక్షన్ వద్ద యోగాంధ్ర–2025 మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహన చోదకులకు ప్రత్యేక యోగ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశ వాహన చోదకులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వాహన చోదకులకు మానసిక ప్రశాంతత అవసరమని, ఏమాత్రం ఒత్తిడికి లోనైనా ప్రమాదాలు బారినపడే అవకాశాలు ఉంటాయన్నారు. డ్రైవర్లు ప్రతిరోజూ ఎంతో కొంత సమయాన్ని యోగాసనాలకు కేటాయించాల్సిన అవసరముందన్నారు. డ్రైవర్లలో అవగాహన కల్పించేందుకు యోగాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో డ్రైవర్లకు యోగాసనాల శిక్షణ, అవగాహన కల్పిస్తున్నామని, తద్వారా ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, వీఎంసీ అడిషనల్ కమిషనర్ డి.చంద్రశేఖర్, ఆర్టీవోలు ఆర్.ప్రవీణ్, కె.వెంకటేశ్వరరావు, రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం.రాజుబాబు, రవాణాశాఖ కానిస్టేబుళ్ల సంఘం అధ్యక్షుడు కె.భద్రాచలం (రాజా) తదితరులు పాల్గొన్నారు.
యోగాతో గర్భకోశ వ్యాధులు దూరం
నున్న(విజయవాడరూరల్): మహిళలు యోగా అలవర్చుకుంటే గర్భకోశ ఆరోగ్యం మెరుగుపడుతుందని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎం.సుహాసిని చెప్పారు. మంగళవారం ప్రపంచ మహిళ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నున్న గ్రామ సచివాలయం–2లో జరిగిన యోగసనాల శిక్షణ కార్యక్రమంలో డీఎంఅండ్హెచ్ఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమో మాట్లాడుతూ మహిళలు వేయాల్సిన యోగాసనాల గురించి వివరించారు. కిశోర బాలికలు కూడా ప్రతి రోజు యోగసనాలు వేయాలని సూచించారు. డెప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ జె.ఇందు మతి, విజయవాడ రూరల్ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ఎన్. విజయ, ఆశా కార్యకర్తలు, పీహెచ్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

యోగాతో మానసిక ప్రశాంతత