
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
గన్నవరంరూరల్: పశువైద్య విద్యార్థులు క్రీడల్లో కూడా రాణిస్తేనే మంచి గుర్తింపు లభిస్తుందని కళాశాల అసోసియేట్ డీన్ పీవీఎస్ కిషోర్ అన్నారు. మండలంలోని కేసరపల్లి డాక్టర్ ఎన్టీఆర్ పశువైద్య కళాశాలలో బుధవారం 15వ వార్షిక క్రీడా దిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డీన్ కిషోర్ మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలన్నారు. వృత్తి విద్యా కళాశాలల్లో నిత్యం చదువులతో గడిపే విద్యార్థులకు క్రీడలు సాంత్వన ఇస్తాయన్నారు. ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా 410 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని క్రీడా ప్రతిజ్ఞ చేశారు. తొలుత జాతీయ జెండాను అసోసియేట్ డీన్ కిషోర్ ఎగురవేసి క్రీడా జ్యోతిని వెలిగించారు. క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. హెచ్వోడీ డాక్టర్ సీహెచ్ వెంకట శేషయ్య, పీడీ డాక్టర్ బి.కృష్ణ దీపిక, అధ్యాపకులు పాల్గొన్నారు.