
దుర్గమ్మ భక్తులకు ఇక్కట్లు తొలగేనా..!
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సుదూర ప్రాంతాల నుంచి దుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన భక్తులకు తిరుగు ప్రయాణంలో ఇక్కట్లు తప్పడం లేదు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం భక్తుల సౌకర్యార్ధం కొండ దిగువన ఉన్న స్నానఘాట్తో పాటు రైల్వే స్టేషన్, బస్టాండ్ల నుంచి దేవస్థానం బస్సులను నడుపుతోంది. దుర్గాఘాట్ నుంచి ఉచిత బస్సు సర్వీసుతో పాటు టికెటు సర్వీసును నడుపుతున్నారు. దేవస్థాన బస్సులు కొండపైకి చేరుకున్న తర్వాత ఓం టర్నింగ్ వద్ద బస్సు పాయింట్ నిలుపుతారు. అయితే భక్తులు బస్సు దిగే పాయింట్, బస్సు ఎక్కే పాయింట్ ఒకే చోట ఉండటంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. పాయింట్లో బస్సులు అంతకుముందే ఉంటే ఇతర ప్రాంతాల్లో బస్సులను నిలుపుతున్నారు. దీంతో భుజానికి ఉన్న లగేజీ, చేతిలో చంటి పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బస్సు కోసం పరుగులు తీస్తూ ఆపసోపాలు పడవలసి వస్తోంది. ప్రతి శుక్ర, శని, ఆదివారాలతో పాటు పండుగ రోజుల్లో ఇక్కడ ఇటువంటి దృశ్యాలు చాలా కామన్. బస్సు కోసం వేచి ఉండే భక్తులు, యాత్రికులు తాము ముందే బస్సు ఎక్కి సీటు దక్కించుకునేందుకు చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. బస్సు ఎక్కే వారు.. బస్సు దిగే వారి మధ్య తోపులాటలు జరుగుతున్నాయి. భక్తులు బస్సు దిగే పాయింట్, బస్సు ఎక్కే పాయింట్ వేరు వేరుగా ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.
జేబుదొంగల చేతివాటం
బస్సులోకి ఎక్కే భక్తులే టార్గెట్గా జేబుదొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. శుక్ర, శని, ఆదివారాలలో బస్సు పాయింట్ వద్ద జేబు దొంగతనాలు పరిపాటిగా మారింది. మహిళా భక్తుల చేతిసంచులు, బ్యాగ్లలో మనీ పర్సులు చోరీకి గురువుతున్న ఘటనలు ఓం టర్నింగ్ పాయింట్లో సర్వసాధారణమయ్యాయి.
ప్రయివేటు వాహనదారుల దందా
అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కొండపైకి చేరేందుకు దేవస్థాన బస్సులు అందుబాటులో ఉన్నాయి. దుర్గాఘాట్ నుంచి దేవస్థానం ఉచిత బస్సులతో పాటు రూ.10 టికెటుపై బస్సులను నడుపుతోంది. అయితే కొంతమంది ప్రయివేటు కారు డ్రైవర్లు దుర్గాఘాట్ పాయింట్ను అడ్డాగా మార్చుకుని భక్తుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. దుర్గాఘాట్ నుంచి దేవస్థాన బస్సు టికెటు రూ.10 కాగా ప్రయివేటు వాహనదారులు రూ.50 వసూలు చేస్తున్నారు. అసలు దుర్గగుడి కొండపైకి భక్తుల వాహనాలతో పాటు దేవస్థాన బస్సులకు మాత్రమే అనుమతి ఉంది. అయితే పోలీసుల నుంచి గాని, దేవదాయ శాఖ నుంచి గాని ఎటువంటి అనుమతులు లేకుండా సుమారు 10 కార్లు కొండపైకి, కొండ దిగువకు సర్వీసులు నడుపుతున్నాయి. డ్రైవర్తో పాటు 9 మందికి మాత్రమే ప్రయివేటు వాహనాల్లో అనుమతించాల్సి ఉండగా, డబ్బుల కోసం 12 మందికి పైగానే కుక్కుతున్నారు. ఈ ప్రయివేటు వాహనాల దందాలో రాజకీయ పార్టీ నాయకుల అనుచరులు ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శీనానాయక్ భక్తుల ప్రయాణ కష్టాలు తొలగేలా చర్యలు తీసుకుంటారని భక్తులు ఎదురు చూస్తున్నారు.
ఓం టర్నింగ్లో బస్సు కోసం ఇబ్బందులు
స్నానఘాట్, ఓం టర్నింగ్లలో
ప్రయివేటు వాహనాల దందా
రూ.10 టికెటుకు రూ.50 వసూలు