
చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్
విజయవాడస్పోర్ట్స్: ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముఠాను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగం అదుపులోకి తీసుకుంది. నిందితుల నుంచి రూ.30 లక్షలు విలువ చేసే 476 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ ఎస్.వి.రాజశేఖరబాబు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. దొంగతనాలు, చైన్ స్నాచింగ్లను నివారించేందుకు నగరంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశాం. ఇందులో భాగంగానే ఇబ్రహీంపట్నం తుమ్మలపాలెం బస్టాప్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న సీసీఎస్ సీఐ రామ్కుమార్ అనుమానాస్పదంగా పారిపోతున్న ఆచ్చి గిరిబాబు(నెల్లూరు జిల్లా ఉప్పుటూరు), ఆచ్చి మహేశ్(నెల్లూరు జిల్లా ఉప్పుటూరు), గాలేటి వెంకట రమణ(ఎన్టీఆర్ జిల్లా దొనబండ), మొగిలి సంధ్య(ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి)లను అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రస్తుతం వీరందరూ ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలోని కొండపల్లి, దొనబండ గ్రామాల్లో నివసిస్తున్నారు. వీరిలో ప్రధాన నిందితుడు ఆచ్చి గిరిబాబు తన స్వగ్రామంలో వ్యవసాయ కూలీ పనులు చేసుకునేవాడు. జల్సాలు, చెడు వ్యసనాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. తన నివాస పరిసరాల్లో గతంలో 12 చైన్ స్నాచింగ్లకు పాల్పడి జైలు జీవితం అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తరువాత తన రెండో భార్య వెంకట రమణమ్మ ఉండే ఎన్టీఆర్ జిల్లా కొండపల్లికి మకాం మార్చాడు. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో తన బైక్పై అతని తమ్ముడు మహేష్తో కలిసి నాలుగు, అతని భార్య వెంకటరమణతో కలిసి మూడు, అతని మరదలు మొగిలి సంధ్యతో కలిసి మూడు, అతనొక్కడే 15 చైన్ స్నాచింగ్లు చేశాడు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్లో రెండు, జగ్గయ్యపేట సర్కిల్లో మూడు, మైలవరం సర్కిల్లో నాలుగు, తిరువూరు సర్కిల్లో మూడు, కృష్ణాజిల్లాలో నాలుగు, ఏలూరు జిల్లాలో రెండు, తెలంగాణ రాష్ట్రంలో ఏడు చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడ్డాడని సీపీ వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఏఎస్ఐలు బాలయ్య, స్వామి, సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ రవి, కానిస్టేబుళ్లు మిథున్, సురేష్, షబ్బీర్, రమణలను సీపీ ప్రత్యేకంగా అభినందించి రివార్డు అందజేశారు. సమావేశంలో క్రైం డీసీపీ తిరుమలేశ్వరరెడ్డి, ఏడీసీపీ ఎం.రాజారావు, ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ రామ్కుమార్ పాల్గొన్నారు.
నిందితుల నుంచి 476 గ్రాముల
బంగారు ఆభరణాలు స్వాధీనం
పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు

చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్