
బంగారం స్కీం పేరుతో ఘరానా మోసం
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): నెలనెలా వాయిదా పద్ధతిలో బంగారానికి డబ్బులు కడితే 25 నెలలు తరువాత కట్టిన దానికి అదనంగా బంగారం, డబ్బులు వేసి ఇస్తారంటూ ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి రూ.30 కోట్లకు టోకరా వేసిన ఘటన విజయవాడ అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగ్నగర్ ప్రాంతానికి చెందిన చలవాది లక్ష్మణుడు ఓ టీవీ చానెల్ చైర్మన్గా పనిచేస్తున్నాడు. అతనికి అయోధ్యనగర్ లోటస్ ల్యాండ్ మార్క్లో నివసిస్తున్న ముచ్చెర్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి తాను వేగ జ్యూవెల్లరీలో ఏజెంట్గా పనిచేస్తానని పరిచయం చేసుకుని బంగారం స్కీమ్ గురించి చెప్పాడు. 25 నెలల పాటు నెలకు 30 గ్రాముల బంగారానికి డబ్బులు కడుతూ ఉంటే 26వ నెల మనం కట్టిన డబ్బులకు, ఆ బంగారానికి అదనంగా వేసి తిరిగి చెల్లిస్తారని చెప్పుకొచ్చాడు. తనపై నమ్మకం కలిగేలా ఓ 25 మంది టీములో ఉన్న వారిలో ఓ వ్యక్తికి మొదటినెల తాను చెప్పినట్లుగానే బంగారం ఇచ్చాడు. దీంతో అతని మాటలు నమ్మి, వేగ జ్యూవెల్లరీపై నమ్మకం కలగడంతో లక్ష్మణుడు నెల నెలా డబ్బులు కడుతున్నాడు. ఈ క్రమంలో 25 నెలలు ముగిసిన తరువాత 26వ నెల డబ్బులు, బంగారం కోసం లక్ష్మణుడు శ్రీనివాసరావుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతని ఫోన్ పనిచేయకపోవడంతో అనుమానం వచ్చిన లక్ష్మణుడు శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఆరా తీయగా మూడు రోజుల నుంచి శ్రీనివాసరావు ఆచూకీ దొరకడం లేదని వారు బదులు ఇచ్చారు. ఇంతలో మరికొంతమంది బాధితులు శ్రీనివాసరావు ఇంటి వద్దకు వచ్చి తాము కూడా బంగారం స్కీముకు, చిట్టీలకు డబ్బులు కట్టామని తమకు కూడా డబ్బులు రావాలని చెప్పారు. దీంతో వారంతా కలిసి బందరురోడ్డులోని వేగ జ్యూవెలరీకి వెళ్లి అక్కడి యాజమాన్యంతో కలిసి మాట్లాడగా వారు శ్రీనివాసరావు తమ ఏజెంట్ అన్న మాట వాస్తవమేనని, అయితే అతను ఎవరి వద్ద డబ్బులు కట్టించుకున్నాడో, ఎంత కట్టించుకున్నాడో తెలియాలంటే ఆయన రావాలని, శ్రీనివాసరావును తీసుకుని వచ్చి ఆధారాలు చూపిస్తే తాము వాటిని ఇస్తామని చెప్పారు. శ్రీనివాసరావు ఆచూకీ ఎక్కడా లభించకపోవడంతో లక్ష్మణుడు ఇతర బాధితులతో కలిసి సింగ్నగర్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బంగారం, చిట్టీలు, టూర్లు
ముచ్చెర్ల శ్రీనివాసరావు బంగారం స్కీములతో పాటు చిట్టీలు వేయడం, జనాలను టూర్లకు తీసుకువెళ్లడం చేసేవాడని తెలిసింది. ఇలా చిట్టీలు, బంగారం స్కీ ములు, టూర్ల పేరుతో డబ్బులు ఇచ్చిన బాధితులు మొత్తం 65 మంది సింగ్నగర్ పోలీసులను ఆశ్రయించారు. సుమారు రూ.30 కోట్ల వరకూ బాధితులు మోసపోయినట్లుగా తెలుస్తోంది. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. లక్ష్మణుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడి ఆచూకీ తెలుసుకుని అతన్ని విచారించిన తరువాత పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.
రూ.30 కోట్లకు టోకరా
టీడీపీ ఎమ్మెల్యే, సినీహీరో నందమూరి బాలకృష్ణ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న
వేగ జ్యూవెల్లరీ ఏజెంట్పై కేసు నమోదు
అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్కు
క్యూకడుతున్న బాధితులు
పరారీలో నిందితుడు ముచ్చెర్ల శ్రీనివాసరావు