
అరుదైన లోపంతో పుట్టిన శిశువును కాపాడారు
పటమట(విజయవాడతూర్పు): కాన్జెనిటల్ డయాఫ్రాగ్మాటిక్ హెర్నియా (ఇఈఏ) అనే ఒక అరుదైన ప్రాణాంతక స్థితితో 32 వారాలకే 1.6 కిలోల బరువుతో జన్మించిన ఒక శిశువును విజయవాడలోని అంకుర ఆస్పత్రి వైద్యులు కాపాడారు. చికిత్స చేసి ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేశారు. బుధవారం ఆస్పత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో నియోటాలజీ నిపుణులు డాక్టర్ అశోక్, డాక్టర్ ఇందుశ్రీ, డాక్టర్ శ్రీముఖి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ వ్యాధి కలిగిన వారికి పేగులు, ఇతర పొట్ట అవయవాలు ఛాతీ భాగంలోకి ప్రవేశిస్తాయని, దీంతో ఛాతీ భాగంలో ఉండే ఊపిరితిత్తుల అభివృద్ధి తీవ్రంగా ప్రభావితమవుతుందన్నారు. ఈ వ్యాధి ముందస్తు జననం (ప్రీటర్మ్), తక్కువ బరువుతో పుట్టిన శిశువుల్లో మరణ ప్రమాదం కలిగించే అవకాశాలు ఎక్కువ చేస్తుందని వెల్లడించారు. అయినప్పటికీ తమ ఆస్పత్రి వైద్య నిపుణుల బృందం శిశువుకు సమర్థంగా చికిత్స నిర్వహించారన్నారు. నియోనటాలజీ నిపుణులైన తాము ము గ్గురం కలిసి శిశువును ప్రథమంగా మెడికల్గా స్థిరపరిచి, శస్త్రచికిత్సకు సిద్ధం చేశామని, తర్వాత పిల్లల శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ ఎం.వరుణ్ కుమార్ డయాఫ్రాగ్ లోపాన్ని సర్జరీ ద్వారా విజయవంతంగా సరిచేశారని తెలిపారు. ప్రసూతి విభాగానికి చెందిన డాక్టర్ సౌమ్య శిశువును సురక్షితంగా డెలివరీ చేశారన్నారు. అనస్తీషియా నిపుణుడు డాక్టర్ నాగరాజ్ శిశువు పరిస్థితిని బట్టి అనస్తీషియా నిర్వహణ ద్వారా శస్త్రచికిత్స సాఫీగా సాగేందుకు ముఖ్య పాత్ర వహించారని తెలిపారు. చికిత్స అనంతరం శిశువు నెమ్మదిగా కోలుకోగా డిశ్చార్జ్ చేశామన్నారు.