
రూ.16.80 లక్షలతో అంచనాలు తయారు
పెనుగంచిప్రోలు: పెనుగంచిప్రోలు ఎత్తిపోతల పథకం మరమ్మతులకు రూ.16.80 లక్షలతో అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించినట్లు ఏపీఎస్ఐడీసీ విజయవాడ డివిజన్ ఈఈ బి.రత్నరాజు తెలిపారు. ఈనెల 28న ‘సాక్షి’ దినపత్రికలో ‘‘ఎత్తిపోతలు..ఎదురు చూపులు’’ కథనానికి అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా ఈఈ రత్నరాజు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పెనుగంచిప్రోలు మునేరు పక్కన 2465.92 ఎకరాలకు సాగు నీరు అందించేందుకు సుమారుగా 17.23 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మించామని, 2018లో పథకానికి శంకుస్థాపన జరగగా 2021లో పూర్తి చేశామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అప్పటినుంచి సాగునీరు రైతులకు అందిస్తున్నామన్నారు. గత ఏడాది సెప్టెంబర్లో వచ్చిన భారీ వరదలకు ఎత్తిపోతల పథకంలోని పంపులు, మోటార్లు, పానెల్ బోర్డు, 2 ట్రాన్స్ఫార్మర్లు, వీసీబీ పానెల్ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయని, విద్యుత్ స్తంభాలు పడిపోయాయన్నారు. వరద తగ్గిన తరువాత అధికారులు పథకాన్ని పరిశీలించి రూ.16.80 లక్షలతో వివరణాత్మక అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించామని పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు.