వక్ఫ్‌ ఉద్యమం రాజ్యాంగ పరిరక్షణ పోరాటమే | - | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ ఉద్యమం రాజ్యాంగ పరిరక్షణ పోరాటమే

Apr 30 2025 5:16 AM | Updated on Apr 30 2025 5:16 AM

వక్ఫ్‌ ఉద్యమం రాజ్యాంగ పరిరక్షణ పోరాటమే

వక్ఫ్‌ ఉద్యమం రాజ్యాంగ పరిరక్షణ పోరాటమే

లబ్బీపేట(విజయవాడతూర్పు): వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమం ముమ్మాటికీ రాజ్యాంగ పరిరక్షణ పోరాటమేనని ముస్లం పర్సనల్‌ లా బోర్డు జాతీయ సభ్యులు జాకీర్‌ రషాదీ, మహమ్మద్‌ ఇషాక్‌ స్పష్టం చేశారు. ఆ చట్ట సవరణ చేయడం మతస్వేచ్ఛపై దాడిగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ముస్లిం పర్సనల్‌ లా బోర్డు జాతీయ కార్యాచరణలో భాగంగా ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలో మంగళవారం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సభ్యులతో పాటు వేర్వేరు జిల్లాల్లోని ముస్లిం జేఏసీ సభ్యులు, జిల్లాల కన్వీనర్లు, జమాత్‌ల ప్రతినిధులు హాజరయ్యారు. జాకీర్‌ రషాదీ, మహమ్మద్‌ ఇషాక్‌ మాట్లాడుతూ.. దేశ పౌరులు అందరికీ మత స్వేచ్ఛ కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 25, 26, 27, 28లను ఉల్లంఘిస్తూ, ఇతర మతాలకు వర్తించని నిబంధనలు ముస్లింలకు ఎందుకని ప్రశ్నించారు. ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఆధ్వర్యంలో జూలై వరకూ ఉద్యమ కార్యాచరణ రూపొందించామని, శాంతియుత ఉద్యమాలు చేస్తామన్నారు.

నేడు లైట్లు ఆర్పి నిరసన

ఈ నెల 30వ తేదీ బుధవారం రాత్రి 9 నుంచి 9.15 గంటల వరకూ ఇళ్లలో, ఫ్యాక్టరీలలో దుకాణాల్లో విద్యుత్‌ దీపాలు ఆర్పి వేసి నిరసన తెలపాలని నిర్ణయించినట్లు జాకీర్‌ రషాదీ, మహమ్మద్‌ ఇషాక్‌ తెలిపారు. ప్రజాస్వామ్య వాదులు, లౌకిక వాదులు ఈ నిరసనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వక్ఫ్‌ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ రఫీక్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు అందరూ భారతీయులేనన్న రాజ్యాంగ స్పృహకు భిన్నంగా మత విభజన రాజకీయాలను కేంద్ర ప్రభుత్వం చేస్తోందన్నారు. అందుకు వక్ఫ్‌ సవరణను అడ్డుకుని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. ముస్లిం జేఏసీ కన్వీనర్‌ మునీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న శాంతియుత ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఈ అంశంపై సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జమ్‌యియ్యత్‌ అహ్లెహదీస్‌ ప్రతినిధి నసీర్‌ అహ్మద్‌ ఉమ్రి, మజ్లిస్‌ ఉల్‌ ఉలేమా ప్రతినిధులు ముఫ్తి యూసుఫ్‌, ముఫ్తి హబీబ్‌, మిల్లీ కౌన్సిల్‌ ప్రతినిధి ముఫ్తి ఆసిఫ్‌, పయమే ఇన్సానియత్‌, మౌలానా మక్బూల్‌ నద్వి, ముక్తార్‌ అలీ, న్యాయవాది అబ్దుల్‌ మతీన్‌ తదితరులు పాల్గొన్నారు.

ముస్లిం పర్సనల్‌ లా బోర్డు జాతీయ సభ్యులు జాకీర్‌ రషాదీ, మహమ్మద్‌ ఇషాక్‌ విజయవాడలో వక్ఫ్‌ చట్ట సవరణపై రాష్ట్ర స్థాయి వర్క్‌షాపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement