నిరుద్యోగులపై కూటమి నయవంచన | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులపై కూటమి నయవంచన

Apr 27 2025 1:55 AM | Updated on Apr 27 2025 1:55 AM

నిరుద్యోగులపై కూటమి నయవంచన

నిరుద్యోగులపై కూటమి నయవంచన

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): కూటమి ప్రభుత్వం నయవంచన చేసిందని జిల్లాలోని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీపై ఎన్నో మాటలు చెప్పి చివరకు అరకొర పోస్టులతో సరిపెట్టారంటూ యువత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 27,333 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం ఆర్‌టీఐ ద్వారా వివరించింది. ఆ మేరకు జిల్లాల్లో అవసరమైన పోస్టులను భర్తీ చేయకుండా అందులో సగానికి మాత్రమే డీఎస్సీ ప్రకటన విడుదల చేయటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పి ఇప్పుడు ఇదేమి మోసమంటూ యువజన సంఘాల నేతలు మండి పడుతున్నారు. దానికి తోడు సంతకం చేసిన ఏడాది కాలం తరువాత నోటిఫికేషన్‌ ఇవ్వటంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో రెండు వేల పోస్టులు అవసరం....

ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారు రెండు వేల పోస్టులు అవసరమని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం 1:20 మేర ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పతి ఉండాలని నేతలు చెబుతున్నారు. ఆ మేరకు రాష్ట్రంలో 27,333 పోస్టులు ఖాళీ ఉన్నాయని సాక్షాత్తూ ప్రభుత్వమే ప్రకటించిందని గుర్తు చేస్తున్నారు. అందులో ఉమ్మడి కృష్ణా జిల్లాకు సుమారు రెండు వేల పోస్టులు అవసరమని తెలుస్తోంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 16,347 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ ఇవ్వటంతో జిల్లాకు కేవలం 1208 పోస్టులే ఉన్నట్లు చూపించి ప్రకటనను విడుదల చేశారని యువత వాపోతుంది. దీనివలన వేలాది మందికి అవకాశం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అసహనం వ్యక్తం చేస్తున్న యువత....

ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి సుమారు 40 వేల మంది ఈ డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో నిబంధనలు, పరిమితులు చూసి వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రభుత్వం కావాలనే ఈ విధమైన నిబంధనలతో యువతను మోసం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ పోస్టులకు సాధ్యమైనంత వరకూ పోటీని తగ్గించేలా కూటమి ప్రభుత్వం అనేక ఆంక్షలు విధిస్తుంది. దాంతో ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న యువతకు నిరాశ ఎదురైంది. ప్రధానంగా ఎస్‌జీటీ పోస్టులకు ఇంటర్‌లో 50 శాతం, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు డిగ్రీలో 50 శాతం, పీజీటీ పోస్టులకు పోస్టు గ్రాడ్యూయేషన్‌లో 55 శాతం మార్కులు తప్పనిసరి చేసింది. వయస్సు విషయంలోనూ నిరుద్యోగులు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు.

గడిచిన ఏడాదిలో 200 మంది పదవీవిరమణ

చంద్రబాబునాయుడు మెగా డీఎస్సీ అంటూ హడావుడి చేసి ఫైల్‌పై సంతకం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా సుమారుగా 180 నుంచి 200 మంది ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది పదవీ విరమణ చేశారని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఈ పోస్టుల లెక్క దేనిలోనూ రాకపోవటంతో విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం జరగనుందని నిపుణులు చెబు తున్నారు. యువతకు పోస్టులు రాక అన్యాయం జరిగితే విద్యార్థులకు సరైన స్థాయిలో ఉపాధ్యాయులు లేక నష్టపోయే పరిస్థితులు నెలకొంటాయి.

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 2000 టీచర్‌

పోస్టులు అవసరం

కానీ ప్రభుత్వం డీఎస్సీలో ప్రకటించినవి కేవలం 1208 పోస్టులు మాత్రమే

ఆందోళన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు

పరిమితులను సవరించాలి

డీఎస్సీ నోటిఫికేషన్‌లో వయస్సు, మార్కులకు సంబంధించిన అనేక పరిమితులను ప్రభుత్వం విధించింది. దాని వలన చాలా మంది అవకాశం కోల్పోతారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న యువతకు ఇది చాలా నిరాశను కలిగించే అంశం. దీనిపై ప్రభుత్వం మార్పు చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయటానికి చర్యలు చేపట్టాలి.

– సీహెచ్‌ వెంకటేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement