మోర్తాడ్(బాల్కొండ): ఉచితంగా వీసాలు, విమాన టికెట్లు అందిస్తూ యూఏఈలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఏడీఎన్హెచ్, జీటీఎం సంస్థలు మరోసారి వలస కార్మికులకు బంపర్ ఆఫర్ను ప్రకటించాయి. ఈనెల 14న సిరిసిల్ల, జగిత్యాల, సికింద్రాబాద్, 15న సికింద్రాబాద్, నిజామాబాద్, ఆర్మూర్లలో ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. క్లీనింగ్ విభాగంలో ఉపాధి విస్తరణతోపాటు హెవీ, లైట్ వెహికిల్ డ్రైవర్లకు అవకాశం కల్పిస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ఉపాధి కల్పించేందుకు అనేకమార్లు ఉచితంగా వీసాలు జారీ చేసి విమాన చార్జీలను సైతం ఏడీఎన్హెచ్ సంస్థనే భరించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులకు సికింద్రాబాద్ కార్యాలయంలో ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఆయా విభాగాల పరిధిలో..
క్లీనింగ్ విభాగంలో పని చేసేవారికి నెలకు రూ. 24 వేల వేతనం(ఇండియన్ కరెన్సీ), ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించనున్నారు. హెవీ డ్రైవర్లకు రూ. 62 వేలు, లైట్ డ్రైవర్లకు రూ. 45 వేల వేతనం అందించనున్నారు. డ్రైవింగ్ విభాగంలో పని చేయాలనుకునేవారు యూఏఈ లైసెన్స్ను కలిగి ఉండాలి. క్లీనింగ్ సెక్షన్లో పని చేయాలనుకునేవారు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చు. బేసిక్ ఇంగ్లిష్ వచ్చి ఉండడంతోపాటు ఈసీఎన్ఆర్ పాస్పోర్టు కలిగి ఉండాలి. ఇతర వివరాలకు సికింద్రాబాద్ – 83320 52299, నిజామాబాద్ – 86868 60999, ఆర్మూర్ – 83320 62299, జగిత్యాల – 83320 42299, సిరిసిల్ల – 93916 61522 నంబర్లలో సంప్రదించాలని జీటీఎం సంస్థ చైర్మన్ సతీశ్రావు ‘సాక్షి’తో తెలిపారు. ఉచిత వీసాలు ఇచ్చే సంస్థ ఏడీఎన్హెచ్ ఒక్కటేనని, ఈ అవకాశాన్ని వలస వెళ్లాలనుకునే వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వీసా, విమాన టికెట్లు ఉచితం
ఏడీఎన్హెచ్, జీటీఎంల ఆధ్వర్యంలో మరోసారి ఇంటర్వ్యూ మేళా
ఉచిత వీసాల జారీకి
ముందుకు వచ్చిన సంస్థలు


