● జినిగాల బీట్లో సంచారం
● పాదముద్రలను గుర్తించిన అధికారులు
సిరికొండ: జిల్లా సరిహద్దులోని అటవీప్రాంతంలో కొద్ది రోజుల క్రితం సంచరించి హడలెత్తించిన పెద్దపులి.. ఇప్పుడు సిరికొండ రేంజ్లోకి వచ్చింది. జినిగాల బీట్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. ఆర్మూర్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ భవాని శంకర్, సిరికొండ, కమ్మర్పల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి నర్సింగ్రావు, రవీందర్ తమ సిబ్బందితో జినిగాల అటవీ ప్రాంతంలో ఆదివారం పర్యటించారు. పెద్దపులి పాదముద్రలను గుర్తించినట్లు వారు తెలిపారు. అటవీ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్మూర్ ఎఫ్డీవో సూచించారు. తెల్లవారు జామున, పొద్దు పోయే ముందు, రాత్రి వేళలో అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని అన్నారు. పశువులను మేత కోసం అటవీప్రాంతంలోకి తీసుకెళ్లొద్దని, అడవికి సమీపంలో వ్యవసాయ భూములు ఉన్న రైతులు పంట పొలాల వద్ద విద్యుత్ కంచెలను అమర్చవద్దని అన్నారు. పెద్దపులి పశువులు, జంతువులను చంపితే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. పెద్దపులి దాడిలో చనిపోయిన పశువులకు అటవీ శాఖ ద్వారా పరిహరం చెల్లిస్తామని ఆయన తెలిపారు. పెద్దపులికి ఎలాంటి హాని తలపెట్టొద్దని, పులిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ఆయన అన్నారు. గస్తీలో సిరికొండ డీఆర్వో గంగారాం, సిరికొండ, కమ్మర్పల్లి రేంజ్ల సిబ్బంది పాల్గొన్నారు.


