వేల్పూర్: మండలంలోని అంక్సాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఉల్లాస్ వయోజన విద్య పరీక్ష కేంద్రాన్ని జిల్లా ప్రాజెక్టు అధికారిణి సంధ్యారాణి పరిశీలించారు. వయోజన విద్యనభ్యసించి పరీక్ష రాస్తున్న వయోజన మహిళలతో మాట్లాడారు. చదువుకు వయసుతో సంబంధం లేదని, ఎప్పుడైనా చదువుకోవచ్చన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉండే నిరక్ష్యరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా మార్చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వయోజన విద్య కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చిందన్నారు. ఏపీఎం మాణిక్యం, సీసీలు సాయన్న, వెన్నమురళి, వీవోఏలు సుమలత, లత, రూప, స్వరూప, మహిళలు పాల్గొన్నారు.
హోరాహోరీగా మల్లయోధుల పోరు
నిజాంసాగర్(జుక్కల్): మత్తడి పోచమ్మ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మహమ్మద్ నగర్ మండలం నర్వలో మల్లయోధుల కుస్తీ పోటీలు హోరాహోరీగా సాగాయి. పొరుగు రాష్ట్రాల మల్లయోధులు తరలిరావడంతో పోటీలు రసవత్తరంగా సాగాయి. గ్రామానికి చెందిన ముప్పిడి రాంప్రసాద్ గుప్తా తన తండ్రి రాములు జ్ఞాపకార్థం 5 తులాల వెండి కడియాన్ని ఆఖరి కుస్తీ మల్లయోధుడికి బహూకరించారు. డీసీసీ జిల్లా కార్యదర్శి గొట్టం నర్సింలు, ఉప సర్పంచ్ చింతల దుర్గానరేశ్ గుప్తా, నాయకులు గొల్ల గోపాల్, గంగారాం, మల్లయ్య, తదితరులున్నారు.
ఎల్లారెడ్డిరూరల్: అల్మాజీపూర్లో ఆదివారం కుస్తీ పోటీలు నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా కుస్తీ పోటీలను నిర్వహించినట్లు సర్పంచ్ దేవదత్తు తెలిపారు. కొబ్బరికాయ కుస్తీ నుంచి రెండున్నర తులాల వెండి కడియం వరకు కుస్తీ పోటీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): భవానిపేట, బాణాపూర్ గ్రామాల్లో ఆదివారం శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా కుస్తీ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. కుస్తీ పోటీల్లో మల్లయోధులు హోరాహోరీగా తలపడ్డారు. గెలుపొందిన వారికి సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు నగదు బహుమతులు అందజేశారు.


