● లోలెవల్ వంతెనలను
ముంచెత్తుతున్న వరద
● నిలిచిపోతున్న రాకపోకలు
హైలెవల్
వంతెనలకు
వేల్పూర్ : వేల్పూర్ మండలం పడగల్, పోచంపల్లి గ్రామాలకు రహదారుల్లో ఉన్న లోలెవల్ వంతెనలపై హైలెవల్ వంతెనల నిర్మాణానికి మోక్షమెప్పుడోనని ఆ గ్రామాల వారు ఎదురు చూస్తున్నారు. జాతీయ రహదారి 63 నుంచి పడగల్ గ్రామానికి ఉన్న రహదారిలో నవాబు చెరువు నీరు ప్రవహించే పెద్ద ఒర్రె, ఊరచెరువు నీరు ప్రవహించే చిన్న ఒర్రె ఉన్నాయి. గతంలో ఈరెండు ఒర్రెలకు లోలెవల్ వంతెనలు నిర్మించారు. 2016లో నవాబు చెరువుకు వచ్చిన భారీ వరదకు ఒర్రె లోలెవల్ వంతెనపై నుంచి ప్రవహించగా అందులో కారు కొట్టుకుపోయి తల్లి, కొడుకు మరణించారు. దాంతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి హైలెవల్ వంతెన నిర్మింపజేశారు. ఊర చెరువు నుంచి వచ్చే చిన్న ఒర్రెకు లోలెవల్ వంతెన అలాగే ఉండిపోయింది. నవాబు చెరువు, ఊరచెరువుల నీరు కిందికి పోచంపల్లి గ్రామం దాటి మోర్తాడ్ మండల గ్రామాలకు వెళ్తుంది. పోచంపల్లికి ఇక్కడ కూడా లోలెవల్ వంతెన ఉంది. పోచంపల్లి గ్రామస్తులు ఆర్మూర్, నిజామాబాద్ లాంటి దూరప్రాంతాలకు వెళ్లాలంటే ఇక్కడ లోలెవల్ వంతెన దాటి వెల్లాల్సి ఉంటుంది. గత సెప్టెంబరులో కురిసిన భారీ వర్షానికి లోలెవల్ వంతెన ధ్వంసమైంది. గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాకాలంలో ఏదో ఒక సమయంలో భారీ వర్షం కురవడం, లోలెవల్ వంతెనలపై నుంచి వరద ప్రవహించడం, రాకపోకలు నిలిచిపోవడం గ్రామస్తులకు ప్రతి ఏటా నిత్యకృత్యమైతోంది. వంతెనలు దాటలేని విధంగా వరదలు వచ్చినప్పుడు సుమారు 20 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించి వన్నెల్ బి గ్రామం మీదుగా ఇతర గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. కొత్త ప్రభుత్వంలోనైనా హైలెవల్ వంతెనలు నిర్మించాలని రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
భారీ వర్షం కురిసినపుడు పడగల్ ఊరచెరువు నుంచి వెళ్లే వరదనీరు గ్రామ రహదారికి ఉన్న లోలెవల్ వంతెనపై నుంచి ప్రవహిస్తుంది. దాంతో గ్రామానికి ఆర్మూర్ వైపు రాకపోకలు ఆగిపోతాయి. చాలా ఏళ్ల నుంచి ఈ సమస్య గ్రామస్తులకు వర్షాకాలంలో ప్రతి ఏటా ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. హైలెవల్ వంతెన నిర్మాణానికి నా వంతు కృషి చేస్తా.
– నల్లరాజు, సర్పంచ్, పడగల్


