కమ్మర్పల్లి : ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యత పెంచాలని, శుభ్రమైన వాతావరణం నెలకొల్పాలని ఇటీవల రాష్ట్ర విద్యా కమిషన్ సిఫారసు చేసింది. సమయానికి అందని మధ్యాహ్న భోజన బిల్లులు, వారానికి తప్పనిసరిగా మూడు రోజులు గుడ్డు అందించే నిబంధన పాటించకపోవడం, సరైన వంట గదులు లేకపోవడం తదితర కారణాలతో జిల్లాలో పిల్లలకు సరైన పౌష్టికాహారం అందడం లేదు. మరోవైపు అపరిశుభ్ర వాతావరణంతో అక్కడక్కడా అపశ్రుతులు చోటుచేసుకున్న ఘటనలు ఉన్నాయి. అయితే, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలోని కమిటీ 14 నెలలు పర్యటించి విద్యాసంస్థల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులో పలు లోపాలను గుర్తించింది. వంట గదులు, తాగునీరు లేకపోవడం, వంట బిల్లు ప్రతి విద్యార్థి పరంగా తక్కువగా ఉండటం, బియ్యం సరిగ్గా ఉండకపోవడం, గుడ్డు అందించకపోవడం వంటి అంశాలను పరిశీలించింది. అనంతరం ఈ పథకం పక్కాగా అమలు కావడానికి పలు ప్రతిపాదనలు చేసింది.
ప్రస్తుతం ఉన్న రేట్లను రెట్టింపు చేయాలని, గుడ్డు ధర రూ. 8 ఇవ్వాలని, మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు వారానికి ఒక్కసారి బిల్లుల చెల్లింపు జరగాలని, దీనికోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ సిద్ధం చేయాలని సిఫారసు చేసింది. అలాగే మధ్యాహ్న భోజన పథకాన్ని 12వ తరగతి(ఇంటర్మీడియెట్) వరకు అమలు చేయాలని సూచించింది.
ఎండీఎంపై ఫోకస్
ఈ నెల 6 నుంచి జాన్ 12 వరకు నిర్వహించే ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా కలెక్టర్లు వా రంలో ఒకరోజు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించి భుజించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల పర్యటన సందర్భంగా కలెక్టర్లు మధ్యాహ్న భోజన సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కట్టెల పొయ్యిపై వంట, బియ్యం నాసిరకం తదితర సమస్యలను పరిష్కరిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మార్కెట్ ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకం ధరలు రెట్టింపు చేయాలి. ఏజెన్సీ నిర్వాహకులకు ప్రతి నెలా ఒకటో తారీఖున వేతనాలు, బిల్లులు అందేలా చూడాలి. అంగన్వాడీ కేంద్రాల మాదిరిగా పాఠశాలలకు కూడా గుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలి.
– పి. చంద్రశేఖర్, పీఆర్టీయూ
మండలాధ్యక్షుడు, కమ్మర్పల్లి
సమస్యలు తీరితేనే
నాణ్యత మెరుగవుతుంది
వారంలో ఒకరోజు కలెక్టర్లు తింటే అపశ్రుతులు తగ్గే అవకాశం
మధ్యాహ్న భోజనంపై
విద్యా కమిషన్ సిఫార్సులు


