● స్థానిక సంస్థల ఎన్నికల్లో
కలిసొచ్చిన రిజర్వేషన్లు
● అయినా పాలనా వ్యవహారాల్లో
మహిళల ప్రాతినిధ్యం తక్కువే..
ఆర్మూర్: మహిళలకు స్థానిక సంస్థల్లో రాజకీయ భాగస్వామ్యం పెరగటం వారు సాధించిన గొప్ప విజయం. అయితే, ప్రజాప్రతినిధులుగా గెలిచిన మహిళలు కొన్నిచోట్ల ఉత్సవ విగ్రహాలుగా మారారన్న విమర్శలున్నాయి. జిల్లాలో ఒకరిద్దరు మహిళా ప్రజా ప్రతినిధులు మినహా మెజారిటీ మహిళా ప్రజా ప్రతినిధులు భర్తలకే బాధ్యతలు అప్పగించి మౌనంగా ఉండిపోతున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్తోపాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 146 వార్డుల్లో 73 స్థానాలు మహిళలకే రిజర్వు చేశారు. నిజామాబాద్ మేయర్గా ఉమారాణి, ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్లుగా గోనె లహరి, తూము పద్మ, బోదిరె నాగమణి విజయం సాధించారు. అయితే జిల్లాలోని పట్టణాలతోపాటు పల్లెల్లో సైతం ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో మహిళా ప్రజా ప్రతినిధుల ప్రాధాన్యత అంతంత మాత్రంగానే ఉంది. వారి భర్తలే చక్రం తిప్పుతూ వ్యవహారాలు చక్కబెడుతున్నారు. కౌన్సిలర్లు, సర్పంచ్లు కేవలం సమావేశాలు, కార్యక్రమాల్లో వేదికలపైకి మాత్రమే పరిమితమవుతున్నారు. గ్రామ పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి. మహిళా రిజర్వేషన్తో విజయం సాధించినప్పటికీ వారి స్థానంలో భర్త లేదా కుటుంబసభ్యులు పెత్తనం సాగిస్తున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తామంటూ ప్రజల ఓట్లతో గెలిచిన మహిళలు మాత్రం అధికారాలన్నీ తమ భర్తలకు కట్టబెట్టి వంటింటికే పరిమితం అవుతున్నారు. దేశ, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో రాణిస్తున్న ఎంతో మంది మహిళా నాయకురాళ్లను ఆదర్శంగా తీసుకొని తాము ప్రజాసేవలో రాణించాలని ఆసక్తి ఉన్నా పురుషాధిక్యత గల పార్టీలు తమను తొక్కి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


