పంచాయతీ ఎన్నికల్లో నిశబ్ద ప్రచారం
రెంజల్(బోధన్)/మాక్లూర్: పంచాయతీ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు తిరగకుండా, మైక్లతో హోరెత్తించకుండా నిశబ్ధంగా ప్రచారం చేస్తున్నారు. అదెలా అంటే.. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్లు ఉండటంతో ఆ ఫోన్లకే సోషల్ మీడియా ద్వారా అభ్యర్థులు నేరుగా తమను గెలిపించాలంటూ ప్రచారం చేసే చిత్రాలు, వీడియోలు పంపిస్తూ రూపాయి ఖర్చు లేకుండా నిశబ్దంగా ప్రచారం చేస్తున్నారు. గతంలో గోడలపై రాతలు, వాల్ పోస్టర్లులు, కరపత్రాలు ముద్రించి ఇంటింటికీ తిరుగుతు అందించే వారు. ఎన్నికల నిబంధనలతో నయా ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వార ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మద్దతుదారులు, కుటుంబీకులతో కలిసి చురుగ్గా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతీ ఒక్కరి వాట్సాప్ స్టేటస్లో అభ్యర్థుల ప్రచారాలే సాక్షాత్కరిస్తున్నాయి. సోషల్ మీడియా వారియర్స్ను ఏర్పాటు చేసుకుని తంతును సాగిస్తున్నారు. తమను గెలిపిస్తే నాయకుడిగా కాదని..సేవకునిగా పని చేస్తామని నమ్మిస్తున్నారు. గ్రామాల్లోని సమస్యలను ఎత్తి చూపుతూ వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని ప్రచారం చేస్తున్నారు. మరికొందరూ ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి తమ సొంత మేనిఫెస్టోలను రుద్దుతున్నారు. సోషల్ మీడియాలో పెద్దగా ఖర్చు లేకపోవడంతో ప్రధాన ప్రచారాస్త్రాలుగా వినియోగించుకుంటున్నారు.
వాట్సాప్లో గ్రూపులు..
కొందరు యువకులు వాట్సాప్లో గ్రామానికి వర్తించే పేర్లను క్రియోట్ చేసుకొని ఆదర్శగ్రామం, ఆదర్శ రైతు, ఐకాన్, లేజెండ్ వంటి గ్రూపులను ఏర్పాటు చేసుకొని తెల్లవారిందే తడువుగా పోస్టులు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు. కొందరు మహిళ సర్పంచ్ అభ్యర్థులు రాణి రుద్రమదేవి, ఇందిరమ్మ, అరుందతి, మంగమ్మ, సరస్వతి వంటి పేర్లతో కొత్తగా వాట్సప్ గ్రూపులను క్రియోట్ చేసుకుని ప్రచారానికి దిగారు. ఇంకొందరు నేరుగా యూట్యూబ్ చానళ్లను పెట్టుకుని గంట గంటకు తన గురించి గొప్పగా చెప్పుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఇంత మంది లైక్లు కొట్టారు. ఇంత మంది చూశారు అంటూ లోలోపల మురిసిపోతున్నారు.
పల్లెల్లో తిరగకుండా,
మైక్లతో హోరెత్తించకుండా..
సోషల్ మీడియాను నమ్ముకున్న పలువురు అభ్యర్థులు
తమను గెలిపించాలంటూ పోస్టులు, వీడియోలు, వాట్సాప్లో స్టేటస్లు పెడుతున్న వైనం
పంచాయతీ ఎన్నికల్లో నిశబ్ద ప్రచారం


