
వెలకట్టలేనివి
అమరుల త్యాగాలు
● పోలీసు అమర వీరుల సంస్మరణ
దినోత్సవంలో ఐజీ, కలెక్టర్, సీపీ
● విధి నిర్వహణలో అసువులు బాసిన అమర వీరులకు ఘన నివాళులు
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్ అర్బన్ : శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తూ అసువులు బాసిన పోలీసు అమర వీరుల త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటుందని మల్టీ జోన్ ఐజీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య అన్నారు.
పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. పోలీసు అమర వీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులు విధినిర్వహ ణలో ఎదురయ్యే అనేక సవాళ్లను తమ ప్రాణాలను పణంగా పెట్టి ధైర్యంగా ఎదుర్కొంటారన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రంలో అసాంఘిక శక్తుల చేతిలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ వీర మరణం పొందారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల త్యాగాలను వృథా కానివ్వమని, వారి స్ఫూర్తి తో మరింత బాధ్యతాయుతంగా శాంతి భద్రతల పరిరక్షణలో నిమగ్నం అవుతామన్నారు. కలెక్టర్ వి నయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల కు సంక్షేమ ఫలాలు సమర్థవంతంగా అందాలంటే శాంతిభద్రతలు నెలకొని ఉన్నప్పుడే సాధ్యపడు తుందన్నారు. పోలీసుల సేవలు, వారి త్యాగాలు మరువలేవని కొనియాడారు. పండుగలు, వీవీఐపీ ల పర్యటనల సందర్భంగా ఇలా ఏ రకంగా చూసి నా పోలీసులు అందిస్తున్న సేవలు అనితర సాధ్యమైనవని అన్నారు. మన దేశంలో, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉందన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అతి తక్కువ వ్యవధిలో చాకచక్యంగా సైబర్ నేరాలను ఛేదిస్తూ నేరస్తుల ఆటకట్టిస్తున్నారన్నారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ ఈ ఏడాది దేశవ్యాప్తంగా 191మంది పోలీసులు అమరులయ్యారని అన్నా రు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 1986 నుంచి ఇప్పటివరకు 18 మంది పోలీసులు అసాంఘిక శక్తులతో పోరాడుతూ అసువులు బాసారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా తమ కర్తవ్య నిర్వహణలో ఎల్లవేళలా పోలీసులు ముందంజలో నిలుస్తున్నారని అన్నారు. అమరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లవేళలా చేదోడువాదోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లాలో విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబీకులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

వెలకట్టలేనివి