
ఇద్దరి మధ్య ఘర్షణ.. ఒకరి మృతి
మోర్తాడ్: మద్యం సేవిస్తూ ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడగా తీవ్ర గాయాలపాలైన ఒకరు మృతి చెందిన ఘటన మోర్తాడ్ మండలం దొన్కల్లో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని నందిగుట్టకు చెందిన షేక్ రహమాన్(42) అనే వ్యక్తి లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అలాగే ఇంటి నిర్మాణ కార్మికునిగా కూడా పని చేస్తున్న అతను నాలుగు రోజుల క్రితం అల్లెపు రాజు అనే వ్యక్తితో దొన్కల్లో పని చేయడానికి వచ్చాడు. ఇక్కడ పని చేస్తున్న రాజు, రహమాన్లు గురువారం అర్ధరాత్రి మద్యం సేవించారు. ఇద్దరి మధ్య వివాదం తలెత్తగా రాజు రహమాన్పై దాడి చేశాడు. ఈ దాడిలో రహమాన్ తల, కాళ్లు, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడిని ముత్యం అనే వ్యక్తి అంబులెన్స్లో శుక్రవారం ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న భీమ్గల్ సీఐ పొన్నం సత్యనారాయణ, మోర్తాడ్ ఎస్సై విక్రమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మద్యం మత్తులో కాలువలో పడి ఒకరి మృతి
బీబీపేట: మద్యం మత్తులో కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బీబీపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రభాకర్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. బీబీపేటకు చెందిన శ్యాగ గణేశ్(45) మద్యానికి బానిస కావడంతో ఎలాంటి పనిచేయకుండా తిరుగుతుండే వాడు. మద్యం తాగుతూ బస్టాండ్ ఆవరణలో పడుకునేవాడు. గురువారం రాత్రి మద్యం తాగి స్థానిక వైన్స్ షాప్ దగ్గర ఉన్న మురికి కాలువ వద్ద పడుకున్నాడు. ప్రమాదవశాత్తు మురికి కాలువలో పడి మృతిచెందాడు. మృతుడి భార్య భార్య నర్సవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన ఐదుగురికి జైలు
ఖలీల్వాడి: డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన ఐదుగురికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ రెండు రోజుల జైలు శిక్షను విధించినట్లు ట్రాఫిక్ సీఐ పి ప్రసాద్ శుక్రవారం తెలిపారు. జిల్లా కేంద్రంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 15 మందిని ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. వీరికి ట్రాఫిక్ పీఎస్లో కౌన్సెలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. పది మందికి రూ. పదివేను వేల జరిమానా, ఐదుగురికి రెండు రోజుల జైలు శిక్షను జడ్జి విధించినట్లు సీఐ పేర్కొన్నారు.
పోలీసుల అదుపులో ఇద్దరు ఆకతాయిలు
ఖలీల్వాడి: నగరంలోని రెండవ టౌన్ పీఎస్లో పరిధిలోని ఉన్న దర్గా వద్ద ఇద్దరు ఆకతాయి యువకులను షీటీం సభ్యులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని షీటీమ్ సభ్యులు స్థానిక పీఎస్కు తరలించారు. విచారణ చేపట్టి వీరిపై కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం.
బాత్రూమ్ విషయంలో గొడవ
రామారెడ్డి: బాత్రూమ్ విషయంలో ఇద్దరు అన్నాదమ్ముళ్లు, వారి కుమారుల మధ్య జరిగిన గొడవలో పలువురు గాయపడినట్లు ఎస్సై రాజారాం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన నర్సయ్య, రాజయ్య ఇద్దరు అన్నాదమ్ముళ్లు. కాగా వీరికి చెందిన బాత్రూం విషయంలో గొడవ జరుగుతోంది. శుక్రవారం వారి మధ్య మళ్లీ గొడవ చోటు చేసుకుంది. మొదట రాజయ్యను తన అన్న నర్సయ్య కుమారుడు శ్రీకాంత్ గొడ్డలితో గాయపర్చాడు. ఆ తర్వాత చిన్న కుమారుడు శ్రీధర్ సైతం రాజయ్యను అతని కుమారుడు నరేశ్పై దాడి చేశాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.