
హిందూ ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత
నిజామాబాద్ రూరల్: హిందూ ధర్మాన్ని పరిరక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నిర్మలమైన మనస్సుతో భగవంతున్ని ప్రార్థించాలని తెలిపారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఇందూరు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ తత్వాన్ని, మహాభగవత్ సమస్త మానవాళి జీవనానికి గల ప్రాముఖ్యతను వారం రోజులుగా భక్తులకు సప్తాహం ద్వారా తెలియజేశారన్నారు. శ్రీ కృష్ణుడు సకల శుభాలను అందించి భక్తుల కష్టాలను తీరుస్తాడని తెలిపారు. రథయాత్రలో స్వామిని దర్శించుకోవడం, రథసేవ చేయడం మహాభాగ్యమన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇస్కాన్ వారు జగన్నాఽథ రథయాత్ర నిర్వహించడం సంతోషకరమన్నారు. ప్రజలకు భగవంతుని పట్ల విశ్వాసం పెరిగేలా ఇస్కాన్ ప్రతినిధులు ప్రవచనాలు అందించారని అన్నారు. కాగా, ఇస్కాన్ ముంబై ఉపాధ్యక్షుడు, ఇస్కాన్ గ్రంథ తెలుగు అనువాదకులు శ్రీమాన్ వైష్ణవాంగ్రీ సేవక్ దాస్ ఆధ్వర్యంలో కేంద్రం అధ్యక్షుడు బలరాం దాస్ ఎనిమిది రోజులపాటు పాత గంజ్లో జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో ప్రవచనాలు చేశారు. రథయాత్రకు ముందు భజనలు, కీర్తనలు, మహాహారతి, పల్లకీ సేవ, ఊంజల్ సేవ, సాంస్కృతిక కార్యక్రమాలతో గంజ్ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఊరేగింపులో జిల్లా నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
వైభవంగా జగన్నాథ రథయాత్ర
పెద్ద సంఖ్యలో హాజరైన భక్తజనం