
‘కాళేశ్వరం’ అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలి
సుభాష్నగర్: రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని, ఈ ప్రభుత్వానికి దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని బీజే పీ శాసనసభా పక్ష ఉపనేత, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ పాలన 11ఏళ్లు పూర్తయిన సందర్భంగా నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఫొటో ఎగ్జిబిషన్, వివిధ రంగాల నిపుణులతో చర్చాగోష్టి కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాల్జేసిందని, అవినీతి, అక్రమాలకు పాల్పడిందని, ఆ పార్టీకి భవిష్యత్ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.10.56లక్షల కోట్లు పదేళ్లలో ఇచ్చిందని, కేంద్ర నిధులతోనే గ్రామాల్లో, పట్టణాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తుచేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు లేకుండా తెలంగాణలో ఒక్క ఇందిరమ్మ ఇళ్లయినా నిర్మిస్తున్నారా అని ప్రశ్నించారు. నాయకులు మురళీధర్గౌడ్, న్యాలం రాజు, లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, ఇప్పకాయల కిషోర్, నాగరాజు, ఆనంద్రావు, తారక్ వేణు, మాస్టర్ శంకర్, సందీప్, నారాయణ యాదవ్, పడాల భూపతి, చిరంజీవి, విజయ్ కృష్ణ, హరీష్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.