
జాతీయ స్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక
నిజామాబాద్నాగారం: చంఢీగడ్లో ఈ నెల 29 నుంచి జూన్ 2 వరకు నిర్వహించే జాతీయ స్థాయి జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. బాలుర విభాగంలో ఎం నిఖిల్ చంద్ర, సీహెచ్ అరవింద్, ఎల్ లక్వేందర్ కుమార్, బి చందు, బాలికల విభాగంలో బి నిశిత, డి లిఖిత, ఎస్ సౌజన్య, ఎం గంగోత్రి రాష్ట్ర జట్టు తరఫున పాల్గొంటున్నట్లు జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వి ప్రభాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్ బుధవారం తెలిపారు. రాష్ట్ర జట్టుకు కోచ్గా ఈ నరేశ్ వ్యవహరిస్తున్నారు.
కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన 32 పరీక్షా కేంద్రాల్లో 8,272 మందికి 7,544 మంది హాజరు కాగా 728 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
కుక్కల దాడిలో జింక మృతి
రుద్రూర్: పొతంగల్ మండలం టాక్లీ శివారులో బుధవారం జింకల గుంపు నుంచి దారి తప్పి వచ్చిన ఓ జింకపై కుక్కలు దాడి చేయడంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సెక్షన్ అధికారి సురేశ్ గ్రామానికి చేరుకొని జింక కళేబరాన్ని అటవీ ప్రాంతంలో దహనం చేశారు. మంజీరా పరివాహక ప్రాంతంలో ఇటీవల జింక పిల్లలు మృతి చెందుతున్నాయి. వారం రోజుల్లో సోంపూర్, టాక్లీ, యాద్గార్పూర్ గ్రామాల్లో కుక్కల దాడిలో నాలుగు జింకలు మృత్యువాత పడ్డాయి. మంద నుంచి దారి తప్పిన జింక పిల్లలు గ్రామ శివారుల్లోకి రావడంతో కుక్కలు దాడి చేస్తున్నాయి. వారం రోజులుగా వర్షాలు పొలాల్లో బురద ఉండడం వల్ల జింక పిల్లలు పరిగెత్తలేకపోతున్నాయి. దీంతో అవి కుక్కల బారిన పడి మృత్యువాత పడుతున్నాయి. మూగ జీవాలను కాపాడాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

జాతీయ స్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక