
పచ్చని కాపురాల్లో వివాహేతర చిచ్చు
ఖలీల్వాడి : రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులతో ముడిపడిందే భార్యాభర్తల బంధం. జీవితాంతం ప్రేమ, ఆప్యాయతలతోపాటు కష్టసుఖాలు, కుటుంబ బాధ్యతలను మోసుకుంటూ ముందుకు సాగేదే సంసారం. ఈ పవిత్ర బంధం.. మనస్పర్థలు, అనుమానాలు, కుటుంబ కలహాలతో విచ్ఛిన్నమవుతోంది. చిన్నపాటి మనస్పర్థల కారణంగా పరాయి వ్యక్తులతో చనువు పెరిగి, సాన్నిహిత్యం ఏర్పడుతోంది. అదే వివాహేతర సంబంధాలకు దారీ తీస్తోంది. పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. ఈ క్రమంలో కొందరు తమ జీవిత భాగస్వామిని అడ్డుతొలగించుకోడానికీ వెనుకాడడం లేదు. దీంతో కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న వరుస ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.
కుటుంబాలు ఛిన్నాభిన్నం..
వివాహేతర సంబంధాలతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెరిగి అఘాయిత్యాలకు దారి తీస్తున్నాయి. భార్య లేదా భర్త జైలుకు వెళితే బెయిలు ఇప్పించేందుకు కూడా ఎవరూ ముందుకు రారు. దీంతో తల్లిదండ్రులు ఉన్నా పిల్లలు అనాథలుగా మారుతారు. వివాహేతర సంబంధంతో ఎలాంటి ఘటన జరిగినా వారి కుటుంబసభ్యులు ఆ ప్రాంతంలో తలెత్తుకొని తిరిగే పరిస్థితి ఉండదు.
● పని ఒత్తిడితో జీవిత భాగస్వామికి సరైన సమ యం కేటాయించకపోవడంతో ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడుతుంది.
● చిన్న, చిన్న సమస్యలపై ఒకరిపై ఒకరికి కోపతాపాలు వస్తాయి. అదే సమయంలో తమతో చ నువుగా మాట్లాడే వారి వైపు ఆకర్షితులవుతున్నారు.
● జీవిత భాగస్వాములు తాము చెప్పినట్లు వినడం లేదంటూ దారితప్పుతున్నారు.●
● స్మార్ట్ ఫోన్లు రావడంతో సోషల్ మీడియా ప్రభావం కుటుంబాలపై పడింది. అందులోని పరిచయాలు నెమ్మదిగా వివాహేతర సంబంధాలకు దారితీస్తున్నాయి. దీంతో కుటుంబంలో చిచ్చు రేగుతోంది.
● ఇతరులతో ఫోన్లో మాట్లాడితే చాలు భాగస్వాముల మధ్య మనస్పర్థలు వస్తున్నాయి. ఇరువురి మధ్య అనుమానాలు పెరిగి గొడవలకు దారితీస్తుంది. చివరికి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు.
కారణాలు ఇవే..
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఆర్మూర్ పట్టణంలోని పెద్దబజారులో నివాసం ఉంటున్న అంజలిని భర్త గంగారెడ్డి ఈ నెల 19న ఇద్దరు పిల్లల ఎదుటే దారుణంగా హత్య చేశాడు. దుబాయ్లో ఉంటున్న గంగారెడ్డి ఫేస్బుక్లో పరిచయమైన మహిళతో కొన్ని సంవత్సరాలుగా వివాహేతర బంధం కొనసాగిస్తున్నాడని భార్యకు తెలిసింది. దీంతో గొడవ ముదిరి విడాకుల వరకు వెళ్లగా.. కోర్టులో కేసు నడుస్తుండగానే అంజలిని హతమార్చాడు.
ఈ నెల 5న మాక్లూర్ మండలంలోని కల్లెడ తండాలో గుగులోత్ శంకర్ డాబా పైనుంచి పడి మృతి చెందాడని భార్య యమున నమ్మించింది. తండ్రి మృతిపై అనుమానంతో కుమారుడు గుగులోత్ రమేశ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అసలు విషయం బయటికొచ్చింది. భార్య యమునను పోలీసులు విచారించగా ప్రియుడు నందుతో కలిసి శంకర్ను కర్రతో కొట్టి, గొంతు నులిమి హత్య చేసినట్లు తెలిపారు.
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు
సోషల్ మీడియాలో పరిచయాలు
జీవిత భాగస్వాములను
వదిలించుకునేందుకు అఘాయిత్యం
రోడ్డున పడుతున్న కుటుంబాలు
కౌన్సెలింగ్ అవసరం
భార్యాభర్తలకు మనస్పర్థలు వచ్చినప్పుడు పోలీసులు లేదా ఫ్యామిలీ కౌన్సెలర్ల వద్ద కౌన్సెలింగ్ తీసుకోవాలి. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలిగిపోతాయి. ఇలాంటి ఘటనలు పెళ్లి అయిన 20 ఏళ్ల తర్వాత జరుగుతున్నట్లు గుర్తించాం. ఇరువురి మధ్య గొడవలు హత్యలకు దారితీస్తున్నాయి. దీంతో కుటుంబం రోడ్డున పడుతుంది.
– రాజావెంకట్రెడ్డి, ఏసీపీ, నిజామాబాద్