
రెండేళ్లలో ప్రాణహిత చేవెళ్ల నీళ్లు
సిరికొండ : నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు రెండేళ్లలో ప్రాణహిత – చేవెళ్ల నీరందిస్తానని ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు. మండలంలోని పెద్దవాల్గోట్, పోత్నూర్, కొండూర్, సిరికొండ, చిన్నవాల్గోట్, న్యావనంది, రావుట్ల, జగదాంబ తండాల్లో రూ.10.23 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో జరిగిన సమీక్షలో పాత డిజైన్ ప్రకారమే మంచిప్ప ప్రాజెక్టు పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రాజెక్టు మిగులు పనులు త్వరగా పూర్తి చేయకపోతే ధర్నా చేస్తానని చెప్పినట్లు గుర్తుచేశారు. సిరికొండ మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయిస్తానన్నారు. సన్నబియ్యం పంపిణీతో పేదల ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తోందని, భూ భారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల అమలు కోసం ఏకగ్రీవ తీర్మానం చేస్తే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. పహల్గాం ఉగ్రదాడి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమేనని, ఉగ్రవాదులు దాడి చేస్తే హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రజలకు ఏం చేశారని రజతోత్సవాలు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ కుటిల పన్నాగాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్రెడ్డి, ఎర్రన్న, ఉమ్మాజీ నరేశ్, పార్టీ మండలాధ్యక్షుడు బాకారం రవి, పీఏసీఎస్ చైర్మన్ గంగాధర్, దేగాం సాయన్న, ఏఎంసీ డైరెక్టర్లు ముత్తెన్న, సంపత్రెడ్డి, యూత్ కాంగ్రెస్ రూరల్ అధ్యక్షుడు మహేందర్, మండలాధ్యక్షుడు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
పాత డిజైన్ ప్రకారమే మంచిప్ప ప్రాజెక్టు
భూ భారతితో సమస్యలకు పరిష్కారం
రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి