
ఖరీఫ్ ప్రణాళిక ఖరారు
డొంకేశ్వర్(ఆర్మూర్): 2025–26 వానకాలం (ఖరీఫ్) సీజన్కు సంబంధించిన పంటల ప్రణాళిక ఖరారైంది. జిల్లా వ్యాప్తంగా 5.21లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా వరి 4.32లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశమున్నట్లు పేర్కొంది. అయితే గతేడాది ఖరీఫ్తో పోలిస్తే ఈసారి కొంతమేర సాగు విస్తీర్ణం పెరగనుంది. తొలకరి చినుకులు పడగానే రైతులు జూన్ మొదటి వారం నుంచి సాగు పనులు ప్రారంభించనున్నారు. వరి తర్వాత సోయాబీన్, మొక్కజొన్న, పసుపు పంటలు ఎక్కువగా సాగు చేసేందుకు రైతులు మొగ్గుచూపే అవకాశముంది.
విత్తనాలు, ఎరువులు..
ఖరీఫ్ పంటలకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులకు కూడా వ్యవసాయ శాఖ ప్రణాళిక తయారు చేసింది. వరికి 1.30లక్షల క్వింటాళ్లు, మొక్కజొన్నకు 3,400 క్వింటాళ్ల విత్తనాలు అవసరం కానున్నట్లు అంచనా వేసింది. అలాగే సోయాబీన్కు 15,500 క్వింటాళ్లు, పెసర 10 క్వింటాళ్లు, కంది 58 క్వింటాళ్లు, మినుములు 15 క్వింటాళ్లు, పత్తి 6,546 క్వింటాళ్లు, అలాగే పచ్చిరొట్ట విత్తనాలు 18వేల క్వింటాళ్లు అవసరం అవుతాయని వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు తయారు చేసింది. అదే విధంగా ఎరువుల విషయానికి వస్తే జిల్లాకు యూరియా 75వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 13,070, ఎంవోపీ 13,105, కాంప్లెక్స్ 44,480 మెట్రిక్ టన్నులు, ఎస్ ఎస్పీ 1,452 మెట్రిక్ టన్నులు అవసరమయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
ఖరీఫ్ అంచనా ప్రణాళిక
పంట ఎకరాలు
వరి 4,32,635
మొక్కజొన్న 47,678
సోయాబీన్ 37,859
పత్తి 1,332
కంది 855
పసుపు 19,735
వేరు శనగ 514
ఇతర పంటలు 3,560
విడుదల చేసిన వ్యవసాయ శాఖ
జిల్లావ్యాప్తంగా 5.21లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా
రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం..
ఖరీఫ్ సాగు అంచనా ప్రతిపాదనలు తయారు చేశాం. విత్తనాలు, ఎరువుల సరఫరా విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తాం. ముఖ్యంగా ఎరువుల కొరత రానివ్వకుండా ఎప్పటికప్పుడు జిల్లాకు తెప్పిస్తాం. ఇప్పటికే జిల్లాలో కొంత బఫర్ స్టాక్ ఉంది. రైతులు ఏఈవోలను సంప్రదించి పంటల సాగులో సలహాలు, సూచనలు తీసుకోవాలి.
–వాజీద్ హుస్సేన్, జిల్లా వ్యవసాయాధికారి