
నూరేళ్లు నిండాయా నాని
● రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు
● చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతి
● చేరదీసి బాగోగులు చూసిన గ్రామస్తులు, ఉపాధ్యాయులు
మాక్లూర్: విధి ఆడిన వింత నాటకంలో ఓ అనాథ ఓడిపోయాడు. చిన్ననాడే తల్లితండ్రుల మృతి.. నా అనుకున్న వారు ఎవరూ లేక పోవడం.. కనీసం పేరు కూడా లేని ఓ యువకుడిని విధి వంచించి గ్రామానికే తీరని శోకాన్ని మిగిల్చింది. మాక్లూర్ మండలం గుంజ్లి గ్రామానికి చెందిన కుర్మ రాజన్న, రంజిని బాయిలు 20 ఏళ్ల క్రితం చనిపోయారు. వీరికి ఒక బాబు ఉన్నాడు. బాబు చిన్నతంలోనే తల్లిదండ్రులు మృతి చెందడంతో గ్రామంలో ఆ బాబు ఒంటరిగా తిరగడం.. ఆకలికి అలమటించడాన్ని గుర్తించిన గ్రామస్తులు అక్కున చేర్చుకున్నారు. అతనికి పేరు కూడా లేకపోవడంతో నాని(21)గా పేరు పెట్టి బాగోగులు చూసుకున్నారు. స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివాడు. చదువుకు కావాల్సిన పుస్తకాలు, దుస్తులు, ఆహారం ఇలా ఏదైనా గ్రామంలోని ప్రతి ఒక్కరూ నానిని బాగా చూసుకునేవారు. చదువుకున్న పాఠశాలలో సైతం ఉపాధ్యాయులు నానిని బాగా చూసుకునేవారు. బదిలీపై వెళ్లినా గ్రామస్తుల ద్వారా అతని బాగోగులు చూసేవారు. ఉపాధి నిమిత్తం దుబాయికి వెళ్తానని నాని చెప్పడంతో ఓ ఉపాధ్యాయురాలు అతనికి కావాల్సిన నగదు, ఇతర సౌకర్యాలు కల్పించింది. అక్కడ కంపెనీ మూతపడడంతో పెద్దగా సంపాదన లేకపోవడంతో తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. గ్రామంలోనే సంపాదించిన కొద్దిపాటి నగదుతో ఓ ఇంటిని కొనుగోలు చేసి అందులో నివసిస్తున్నాడు. పని చేయాలనే తపనతో ఫొటోగ్రఫి నేర్చుకొని ఆ వృత్తిలో ఎదుగుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం భైంసాలో ఉండే ఓ శుభకార్యానికి నాని ఫొటోలు తీయాల్సి ఉంది. దీంతో అతను గ్రామానికి చెందిన మరో వ్యక్తితో బైక్పై బయలుదేరాడు. నిర్మల్ జిల్లా లోస్ర మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయమై ఘటన స్థలిలోనే మృతి చెందాడు. అతని వెంట ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గుంజ్లి గ్రామస్తులందరూ ఘటన స్థలానికి ఆటోల్లో బయలుదేరి బోరున విలపించారు. గ్రామంలో అందరి నోట ఉండే నాని ఇప్పుడు లేడంటు గ్రామస్తులు రోదించిన తీరు స్థానికులను కదిలించింది. తమ కడుపున పుట్టిన కుమారుడి వలే నానిని చూసుకున్నామని.. నాని నీకు నూరేళ్లు నిండాయా అంటూ మహిళలు గుండెలవిసేలా రోదించారు.