
అప్పు తీర్చడం లేదని వాహనానికి నిప్పు
● ధాన్యం కుప్పకు సైతం
నిప్పంటించిన అల్లుడు
● పోలీసులకు ఫిర్యాదు చేసిన
అత్తింటివారు
నాగిరెడ్డిపేట: అత్తింటివారు తీసుకున్న అప్పు తీర్చడంలేదనే కారణంతో అర్ధరాత్రి వేళ తన మామకు చెందిన టీవీఎస్ ఎక్సెల్ వాహనానికి నిప్పు పెట్టాడో అల్లుడు. అంతటితో ఆగకుండా ధాన్యం కుప్పను సైతం తగలబెట్టడానికి యత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మాసాన్పల్లి గ్రామానికి చెందిన చాకలి బాలమణి, సాయిలు దంపతులు తమ కూతురును మండలంలోని మాటూర్ గ్రామానికి చెందిన బాలకృష్ణకు ఇచ్చి వివాహం జరిపించారు. కాగా అవసరాల నిమిత్తం సాయిలు తన అల్లుడు వద్ద రూ. 2 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అల్లుడు బాలకృష్ణ.. తన భార్యను కొన్నాళ్ల క్రితం పుట్టింటి వద్ద వదిలి వెళ్లాడు. ఈనెల 23న మాసానిపల్లికి వెళ్లి భార్యను తీసుకెళ్లాడు. అత్తింటివారు తీసుకున్న అప్పు చెల్లించడం లేదన్న కోపంతో గురువారం అర్ధరాత్రి మాసాన్పల్లికి వెళ్లి తన మామకు చెందిన టీవీఎస్ ఎక్సెల్కు నిప్పుపెట్టాడు. దీంతో పాటు గ్రామశివారులోని ధాన్యంకుప్పకు సైతం నిప్పటించాడు. ఎక్సెల్ వాహనం పూర్తిగా కాలిపోగా.. ధాన్యం కుప్ప పాక్షికంగా కాలిపోయింది. ఈ విషయమై చాకలి బాలమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని నాగిరెడ్డిపేట ఎస్సై మల్లారెడ్డి తెలిపారు.