
జిల్లా జడ్జి సునీతకు సన్మానం
ఖలీల్ వాడి: జిల్లా జడ్జి సునీతా కుంచాల పెద్దపల్లి జిల్లాకు బదిలీ అయిన సందర్భంగా జిల్లా న్యాయాధికార సేవా సంస్థ సమావేశ మందిరంలో న్యాయవాదులు శుక్రవారం సన్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయవాద పరిషత్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. మూడున్నరేళ్లలో జిల్లా ప్రజలతో మమేకమై న్యాయ సేవలు అందించడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు సత్వర న్యాయం అందేలా కృషి చేయాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. డీఎల్ఎస్ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, డిఫెన్స్ కౌన్సిల్స్ రాజ్కుమార్ సుబేదార్, ఉదయ్ కృష్ణ, ప్రమోద్, విశ్వక్ సేన్ పాల్గొన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాది టక్కర్ హన్మంత్ రెడ్డి సరస్వతి మాత రాగి విగ్రహం అందజేసి శాలువాతో జడ్జిని సన్మానించారు.
వినాయక కల్యాణ మహోత్సవం
నిజామాబాద్ రూరల్: సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో స్వామివారి కల్యాణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని గాయత్రినగర్ వద్ద గల సిద్ధి వినాయక స్వామి దేవాలయం 25వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్ఛరణాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు మచ్చ చంటయ్య మాట్లాడారు. భక్తులకు అన్నదానం చేశారు.