నిజామాబాద్ అర్బన్: ధాన్యం సేకరణ ద్వారా మ హిళా సంఘాలు ఆర్థిక ప్రగతి సాధించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు 200 పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించాలని నిర్ణయించామన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణపై మ హిళా సంఘాల ప్రతినిధులతో మంగళవారం కలెక్టరేట్లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్రెడ్డి ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల నిర్వహణపై కీలక సూచనలు చేశారు. మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రభుత్వ పా ఠశాలలు, వసతి గృహాల విద్యార్థినీవిద్యార్థుల యూనిఫామ్లు కుట్టే బాధ్యతను, ఇందిరమ్మ మ హిళా శక్తి క్యాంటీన్లు, ఆర్టీసీ అద్దె బస్సులు, పెట్రోల్ పంప్లు, సొలార్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల వంటి సుమారు 14 రకాల పనులను ప్రభుత్వం మహిళ లకు కేటాయిస్తూ, వారి అభ్యున్నతికి ఎంతోగానో కృషి చేస్తోందన్నారు. గత సీజన్లో ఐకేపీ మహిళా సంఘాల ద్వారా జిల్లాలో కేవలం 50 కేంద్రాలు మాత్రమే నిర్వహించామని, ఈ సీజన్లో ఇప్పటికే 110 కేంద్రాల నిర్వహణ కోసం ఎస్హెచ్జీ గ్రూపులను గుర్తించినట్లు వివరించారు. కొనుగోలు కేంద్రాల సంఖ్యను 200 పైగా పెంచాలని, తద్వారా మహిళా సంఘాలు కమీషన్ రూపంలో సుమారు రూ.5 కోట్ల వరకు లాభాలు ఆర్జించగలుగుతాయని అన్నారు. మహిళా సంఘాల ప్రతినిధులకు ధాన్యం సేకరణ, కేంద్రాల నిర్వహణపై సహకార సంఘాల బాధ్యులు, సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో ఎవరైనా ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని సుదర్శన్రెడ్డి హెచ్చరించారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించే మహిళా సంఘాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతు అందిస్తుందన్నారు. ముఖ్యంగా ధాన్యం రవాణాకోసం లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పెద్ద మొత్తంలో ఆర్థిక పరమైన లావాదేవీలతో ధాన్యం సేకరణ ప్రక్రియ ముడిపడి ఉందని, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా రికార్డులను సక్రమంగా నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ రమేశ్రెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, సివిల్ సప్లయీస్ డీ ఎం శ్రీకాంత్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, మెప్మా పీడీ రాజేందర్, డీసీవో శ్రీనివాస్, మార్కెటింగ్ ఏడీ గంగవ్వ, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్హెచ్జీలకు 200 పైగా
కొనుగోలు కేంద్రాలు
మహిళా సాధికారతకు ప్రాధాన్యతఇస్తున్న సీఎం రేవంత్
సన్నాహక సమావేశంలో
బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి
ధాన్యం సేకరణతో ఆర్థిక ప్రగతి సాధించాలి