
కలగానే బీసీ గురుకుల సొంత భవనాలు!
మోర్తాడ్(బాల్కొండ): వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలకు సొంత భవనాల నిర్మాణం కలగానే మిగిలిపోనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీ గురుకుల పాఠశాలలకు సొంత భవనాలను నిర్మించే అంశంపై ప్రభుత్వం ఎలాంటి ప్రస్తావన తీసుకరాలేదు.
జిల్లాలో మోర్తాడ్, ఎడపల్లి, ఆర్మూర్, బాల్కొండ, కుద్వాన్పూర్, బోధన్, శ్రీరాంపూర్, చీమన్పల్లి, నిజామాబాద్లో బాలబాలికలకు వేర్వేరుగా పాఠశాలలను నిర్వహిస్తున్నారు. 2017–18 విద్యా సంవత్సరంలో ఈ బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించగా ఎక్కడ కూడా సొంత భవనాలు లేవు. 2024–25 బడ్జెట్లో రూ.1,546 కోట్లు కేటాయించినా ఎక్కడ కూడా భవనాలు నిర్మించలేదు. దీంతో అద్దె భవనాల్లోనే వాటిని కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ గురుకుల పాఠశాలల ప్రారంభానికి చూపిన ఆసక్తి.. సొంత భవనాల నిర్మాణంపై చూపలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయించినా అడుగులు మాత్రం ముందుకు పడలేదు.
తెరపైకి ఇంటిగ్రేటెడ్..
కొత్తగా ఒక్కో నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటు, భవనాల నిర్మాణంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు సొంత భవనాలను నిర్మించేందుకు రూ.11,600ల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటును తెరపైకి తీసుకరావడంతో గతంలో ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలకు సొంత భవనాల నిర్మాణం మరుగునపడినట్లేనా అనే సందేహం వ్యక్తమవుతోంది.
గతంలో నిధులు కేటాయించినా
ముందుకు పడని అడుగులు
ప్రస్తుత బడ్జెట్లో నిధులు
కేటాయించని ప్రభుత్వం
కొత్తగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటు ప్రస్తావన