డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో కురిసిన అకాల వర్షానికి 1,036 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ నెల 20, 21 తేదీల్లో సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, సాలూర, నవీపేట్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం, వడగళ్లు పడిన విషయం తెలిసిందే. వ్యవసాయాధికారులు శనివారం క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతుల నుంచి వివరాలు సేకరించారు. వరికి ఎక్కువ నష్టం వాటిల్లగా, మొక్కజొన్న స్వల్పంగా దెబ్బతిన్నది. రాళ్ల వానకు ధర్పల్లి మండలం హొన్నాజీపేట్లో 185 ఎకరాల్లో వరికి నష్టం జరిగింది. 1,036 ఎకరాల్లో 33 శాతానికి మించి దెబ్బతిన్న పంటలు 884 ఎకరాల్లో గుర్తించగా, 1,033 మంది రైతులు నష్టపోయినట్లు అంచనా వేశారు. కాగా, 33 శాతానికి మించి పంటకు నష్టం జరిగితేనే ప్రభుత్వం నుంచి రైతులకు నష్ట పరిహారం వచ్చే అవకాశం ఉంటుంది.
● వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా