ధర్పల్లి: మండల కేంద్రంలోని పశువైద్యశాల అధ్వానంగా మారింది. పూర్తిగా శిథిలావస్థకు చేరినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏళ్ల తరబడి అందులోనే మూగ జీవాలకు వైద్యం అందించాల్సిన దుస్థితి నెలకొంది. మూగజీవాలకు వైద్యం అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం పశువైద్యశాలలను ఏర్పాటు చేసింది. వైద్యసేవలు అందిస్తున్నా.. కొత్త భవనాల నిర్మాణంలో మాత్రం ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. ధర్పల్లిలో యాభై ఏళ్ల క్రితం నిర్మించిన పశు వైద్యశాల ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. దీంతో పశువైద్య సిబ్బందితోపాటు వైద్యశాలకు వచ్చే పశు పోషకులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవనం ఎప్పుడు ఏ క్షణాన కూలుతుందో అని సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. చిన్నపాటి వర్షాలు కురిస్తే పైకప్పు నుంచి వర్షపు నీరు గదుల్లోకి చేరుతోంది. పశువైద్యశాలలో ఉన్న మందులతో పాటు రికార్డులు తడిచిపోతున్నాయి. శిథిలావస్థకు చేరిన భవనాలకు కనీస మరమ్మతులు చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలో మొత్తం గొర్రెలు 14,320, గేదెలు 6,668, మేకలు 4,200, ఆవులు 3,600 ఉన్నాయి. ఈ పశు వైద్యశాలలో జీవాలకు వైద్యం అందించడానికి పశువైద్యాధికారితో పాటు ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి శిథిలావస్థకు చేరిన భవనాన్ని తొలగించి నూతన భవన నిర్మాణం చేపట్టాల్సిర అవసరం ఎంతైనా ఉంది.
భయాందోళనలో సిబ్బంది
నూతన భవనం నిర్మించాలని గ్రామస్తుల వేడుకోలు