టాటా.. బైబై
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు గురువారం ముగిశాయి. పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు చివరి పరీక్ష పూర్తవ్వడంతో కేంద్రాల వద్ద ఆనందంతో ఎగిరి గంతులేశారు. ఇన్నాళ్లూ కలిసి చదివి..ఇక మీదట ఉన్నత చదువుల కోసం ఎక్కడెక్కడికో వెళ్తామంటూ పలువురు కన్నీరుపెట్టుకున్నారు. హాస్టల్ విద్యార్థులు సామగ్రిని తీసుకొని ఇళ్లకు ప్రయాణమయ్యారు. –సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్–నిజామాబాద్
నిజామాబాద్అర్బన్: ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిశాయి. చివరి రోజైన గురువారం ఇంటర్ సెకండియర్ కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 15,896 మంది వి ద్యార్థులకు 15,458 మంది హాజరుకాగా, 438 మంది గైర్హాజరయ్యారు. 57 పరీక్ష కేంద్రాలకు గాను 52 కేంద్రాలను తనిఖీ చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. ఈనెల 5న పరీక్షలు ప్రారంభం కాగా, మొత్తం 14 మంది విద్యార్థులు డిబార్ అయ్యారు.
అధ్యాపకులను రిలీవ్ చేయాలి
ఈనెల 22 నుంచి మొదటి స్పెల్, 24 నుంచి రెండో స్పెల్, 26 నుంచి మూడో స్పెల్, 28 నుంచి నాల్గో స్పెల్ మూల్యాంకనం ప్రారంభమవుతుందని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. మూల్యాంకనం విధులకు గైర్హాజరైతే చ ర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఆయా కళాశాలల ప్రిన్సిపాల్లు నిర్ణీత తేదీల్లో మ్యూల్యాంకనం విధులకు సంబంధిత అధ్యాపకులను రిలీవ్ చేయాలని ఆదేశించారు. రిలీవ్ చేయని ప్రిన్సిపాల్లపై బోర్డు నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.
చివరి రోజు 438 మంది గైర్హాజరు
ముగిసిన ఇంటర్ పరీక్షలు
ముగిసిన ఇంటర్ పరీక్షలు