నిజామాబాద్ అర్బన్: సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ టీచర్లు మంగళవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. వాగ్వాదాలు, తోపులాటలు, అరెస్టులు చోటు చేసుకున్నాయి. కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు మంగళవారం మెరుపు ముట్టడి చేపట్టారు. ఉదయం 10 గంటలకు పెద్ద ఎత్తున అంగన్వాడీ టీచర్లు కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు గేట్లు మూసేసి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సీఐటీయూ నాయకులతోపాటు పలువురిని పోలీసులు అరెస్టు చేయగా అంగన్వాడీలు అడ్డుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏసీపీ రాజా వెంకటరెడ్డి, రూరల్ సీఐ సురేశ్ ఆధ్వర్యంలో నిరసనకారులను అరెస్టు చేసి స్టేషన్కి తరలించారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలంటూ అంగన్వాడీలు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోగా, కాసేపు తోపులాట జరిగింది. అనంతరం కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు నిరసన ప్రాంతానికి చేరుకొని అంగన్వాడీలతో మాట్లాడారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అయినా కూడా అంగన్వాడీలు వినకుండా ప్రవేశమార్గం వద్ద మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిరసన కొనసాగించారు. దీంతో కలెక్టరేట్లోనికి వెళ్లే ఉద్యోగులు బయటే నిలబడిపోయారు. అనంతరం పోలీసులు భారీ బందోబస్తుతో ఆందోళనకారులను నిలువరించారు.
లోపలికి వెళ్లేందుకు
అంగన్వాడీల యత్నం
అడ్డుకొని అరెస్టు చేసిన పోలీసులు
నిరసనకారులతో మాట్లాడిన కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు
కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం