ఎడపల్లి: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలు చేపట్టేలా ప్రోత్సహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఎడపల్లి మండలం జైతాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలన చేపట్టారు.
గ్రామంలో ఎన్ని కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని కలెక్టర్ ఆరా తీశారు. మొత్తం 125 మందికి మంజూరు కాగా, వారిలో 25 మంది ఇళ్ల నిర్మాణాలు చేపట్టారని అధికారులు తెలిపారు. మిగతా లబ్ధిదారులు సత్వరమే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ఎడపల్లిలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూం లను సందర్శించి బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులు, వంట నూనె, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు. వండిన అన్నం, వంటలను పరిశీలించారు. కలెక్టర్ వెంట గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణ, అధికారులు, సిబ్బంది ఉన్నారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు