డిచ్పల్లి: రాష్ట్ర ప్రభుత్వం, రెడ్క్రాస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో వృద్ధుల కోసం డిచ్పల్లి మండలం రాంపూర్లో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా అనాథ వృద్ధులను గమనిస్తే రాంపూర్లో నూతనంగా ప్రారంభించబడిన వృద్ధాశ్రమంలో చేర్పించాలని కలెక్టర్ సూచించారు. ఆధార్ కార్డు, రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు, అందుబాటులో ఉంటే ఆరోగ్య సంబంధిత ఫైల్, సంబంధిత జీపీ నుంచి అనాథ వృద్ధులే అని ధ్రువీకరణ పత్రము, వృద్ధులను వృద్ధాశ్రమంలో చేర్పించే వారి పూర్తి వివరాలు, మొబైల్ నంబర్తో దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. జిల్లా వృద్ధుల, శిశు సంక్షేమ అధికారి కార్యాలయం, ఖలీల్వాడీ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయం, రాంపూర్ లోని ఓల్డ్ ఏజ్ హోమ్ను సంప్రదించి వృద్ధులను ఆశ్రమంలో చేర్పించవచ్చని కలెక్టర్ తెలిపారు. ఆశ్రమానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం 9849933300, 8688887004, 9618844461 నంబర్లను సంప్రదించవచ్చని అన్నారు.
తలసేమియా బాధితులకు రక్తమార్పిడి
ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, నిజామాబాద్ శాఖ భవనంలో తలసేమియా వ్యాధి రక్త మార్పిడికి రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రక్త మార్పిడి చేయబడుతుందని, ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు తెలిపారు. ఐదేళ్లు దాటిన తలసేమియా బాధితులు ఉచిత వైద్య సేవలు పొందేందుకు రేషన్, ఆధార్ కార్డు తప్పనిసరి అన్నారు. ఐదేళ్ల లోపు బాలలకు సంబంధించి వాళ్ల పేరెంట్స్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఒక రోజు ముందు ఫోన్ చేసి బుకింగ్ చేసుకోవాలని, ప్రస్తుతం మంగళ, గురు, శనివారాల్లో రక్త మార్పిడి ఉంటుందని సూచించారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో తలసేమియా
బాధితులకు ఉచిత వైద్య సేవలు
అనాథ వృద్ధులను వృద్ధాశ్రమంలో చేర్పించాలి