‘సాగర్‌’లో డేంజర్‌ బెల్స్‌! | - | Sakshi
Sakshi News home page

‘సాగర్‌’లో డేంజర్‌ బెల్స్‌!

Mar 19 2025 1:34 AM | Updated on Mar 19 2025 1:33 AM

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ జలాశయంలో వేగంగా తగ్గుతున్న నీటిమట్టంతో ఈ సంవత్సరం డేంజర్‌ బెల్స్‌ మోగేలా ఉన్నాయి. ప్రాజెక్ట్‌ నుంచి కాలువల ద్వారా ఆయకట్టుకు నీటి విడుదల కొనసాగుతుండడంతో నీటి నిల్వ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రతి రోజు 0.7 టీఎంసీల నీరు ఆయకట్టుతోపాటు ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. యాసంగి ప్రణాళిక ప్రకారం ఆయకట్టుకు మరో 22 రోజులపాటు నీటిని విడుదల చేయాలి. అందుకు 15 టీఎంసీల నీరు అవసరం. ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 23 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అందులో 5 టీఎంసీలు డెడ్‌స్టోరేజీకి పోగా, మిషన్‌ భగీరథకు 1.6 టీఎంసీలు, ఆవిరి రూపంలో 2.8 టీఎంసీల నీరు పోతుంది. చివరికి ప్రాజెక్ట్‌లో మిగిలేది 14 టీఎంసీల నీరు మాత్రమే. దీంతో ఆయకట్టుకు నీటి విడుదలలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. వచ్చే ఖరీఫ్‌లో సకాలంలో వర్షాలు కురువక పోతే తాగునీటికీ తిప్పలు తప్పేలా కనిపించడం లేదు.

చివరి ఆయకట్టు కోసం..

చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలంటే నిరంతరం కాలువల ద్వారా పరిమాణం తగ్గించకుండా నీటి విడుదల కొనసాగించాలి. దీంతో నీటి ఆవిరి కూడా ఎక్కువగానే అవుతుంది. ప్రస్తుతం కాకతీయ కాలువ ద్వారా 5500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు రికార్డుల్లో తెలుపుతున్నారు. కానీ, కాలువలో ఏడు వేల క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎల్‌ఎండీ ఎగున ఉన్న చివరి ఆయకట్టు వరకు నీరు అందాలంటే ఎక్కువ మొత్తంలోనే నీటి ప్రవాహం ఉండాలి.

కొనసాగుతున్న నీటి విడుదల

ప్రాజెక్ట్‌ నుంచి ఆయకట్టు కోసం కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. కాకతీయ కాలువ ద్వారా 5500, వరద కాలువ ద్వారా 500, సరస్వతి కాలువ ద్వారా 700, లక్ష్మి కాలువ ద్వారా 250, అలీసాగర్‌ లిప్టు ద్వారా 463 , గుత్ప లిప్టు ద్వారా 270, ముంపు గ్రామాల లిప్టుల ద్వారా 312, మిషన్‌ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 537 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1070.10(23 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఎలాంటి ఇబ్బంది లేదు

ఎస్సారెస్పీ నుంచి ఆయకట్టుకు, తాగునీటి అవసరాలకు నీటి విడుదలలో ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం పంటల కోసం 13 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. రైతులు అధికారులతో సహకరించి నీటిని పొదుపుగా వాడాలి. చివరి ఆయకట్టుకు వరకు నీరు అందేలా సహకరించాలి.

– చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీ

ఎస్సారెస్పీలో వేగంగా

తగ్గుతోన్న నీటిమట్టం

ప్రాజెక్ట్‌లో ప్రస్తుత నీటి నిల్వ

23 టీఎంసీలు

రోజుకు 0.7 టీఎంసీల నీటి వినియోగం

ఆయకట్టుకు మరో 15 టీఎంసీల

నీరు అవసరం

‘సాగర్‌’లో డేంజర్‌ బెల్స్‌!1
1/1

‘సాగర్‌’లో డేంజర్‌ బెల్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement