గంజాయి కేసులో ముగ్గురి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి కేసులో ముగ్గురి అరెస్ట్‌

Mar 19 2025 1:34 AM | Updated on Mar 19 2025 1:33 AM

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌.. ఒకరు మృతి

పెళ్లయిన పదమూడు

రోజులకే మృత్యు ఒడికి..

చెరువులో పడి యువకుడి మృతి

సదాశివనగర్‌: పెళ్లయిన పదమూడు రోజులకే ఓ యువకుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన సదాశివనగర్‌ మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన కడమంచి రాములు(26) ఆరు నెలల క్రితం దుబాయి నుంచి వచ్చాడు. ఈ నెల 6న మెట్‌పల్లికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. గ్రామ సమీపంలోని పాత చెరువులో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన రాములు ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోయాడు. రాములకు ఈత రాకపోవడంతోనే నీట మునిగి మృతి చెందాడు. మృతుడి తండ్రి సిద్ధిరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

నిజాంసాగర్‌: నిజాంసాగర్‌ ప్రధాన కాలువలో గల్లంతైన రామగళ్ల దశరథం(38) అనే వ్యక్తి మృతదేహం మంగళవారం సాయంత్రం లభ్యమైంది. మహమ్మద్‌నగర్‌ మండలం బూర్గుల్‌ గ్రామానికి చెందిన దశరథం సోమవారం గ్రామ శివారులోని ప్రధాన కాలువలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం అగ్నిమాపక సిబ్బంది ప్రధాన కాలువ నీటిలో గాలించారు. సింగీతం గ్రామ శివారులోని ప్రధాన కాలువ బ్రిడ్జి వద్ద మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

డ్రంకన్‌ డ్రైవ్‌లో తొమ్మిది మందికి జైలు

ఖలీల్‌వాడి: డ్రంకన్‌ డ్రైవ్‌లో తొమ్మిది మందికి జైలు శిక్ష విధిస్తూ మెజి స్ట్రేట్‌ నూర్జహాన్‌ మంగళవారం తీర్పు ఇచ్చినట్లు ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలోని పీఎస్‌ల పరిధిల్లో డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారిని పోలీసులు పీఎస్‌కు తరలించి కౌన్సెలింగ్‌ ఇచ్చి కోర్టులో హాజరుపర్చారు. జడ్జి తొమ్మిది మందికి జైలు శిక్ష విధించగా మరో 33 మందికి జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు. తొమ్మిది మందిలో ఆరుగురికి రెండు రోజుల జైలు, ముగ్గురికి ఒక రోజు జైలు శిక్షను జడ్జి విధించారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపొద్దని సూచించారు.

పబ్లిక్‌ న్యూసెన్స్‌ కేసులో ఎనిమిందికి ఒకరోజు..

బోధన్‌టౌన్‌: బోధన్‌ పట్టణంలో పబ్లిక్‌ న్యూసెన్స్‌కు పాల్పడ్డ ఏడుగురిపై ఒక రోజు జైలు శిక్షను విధిస్తూ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ శేష తల్పసాయి తీర్పు ఇచ్చినట్లు పట్టణ సీఐ వెంకట నారాయణ మంగళవారం తెలిపారు. బోధన్‌ పట్టణంలోని ఆజాంగంజ్‌ కాలనీలో పక్కపక్కన ఉండే ఇరు కుటుంబాలు చిన్న విషయంలో గొడవ పడి పబ్లిక్‌ న్యూసెన్స్‌ చేశారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇరు కుటుంబాల సభ్యులను అరెస్టు చేసి జడ్జి ఎదుట హాజరుపర్చారు. విచారణలో నేరం రుజువు కావడంతో ఇరు కుటుంబాలలోని ఏడుగురితో పాటు డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ మరో వ్యక్తికి జడ్జి ఒక రోజు జైలు శిక్షను విధించినట్లు సీఐ పేర్కొన్నారు.

చికిత్స పొందుతూ మహిళ మృతి

మాచారెడ్డి: జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందినఠ్లు ఎస్సై అనిల్‌ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన బానోత్‌ పద్మ(43) అంగవైకల్యంతో బాధపడుతోంది. జీవితంపై విరక్తితో ఈ నెల 15న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించింది. కొద్ది సేపటికి విషయాన్ని గమనించిన కుటుంబీకులు సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.

దాడి చేసిన ఇద్దరికి జరిమానా

నందిపేట్‌: ఆస్తి తగాదాల్లో కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడిన ఇద్దరికి రూ. పది వేల చొప్పున జరిమానాను విధిస్తూ ఆర్మూర్‌ జడ్జి వేముల దీప్తి తీర్పు ఇచ్చినట్లు నందిపేట ఎస్సై చిరంజీవి పేర్కొన్నారు. వివరాలిలా ఉన్నాయి. 2019లో నందిపేట మండలం కుద్వాన్‌పూర్‌లో ఆస్తి పంపకాల విషయంలో తండ్రీ కొడుకులైన గోజూర్‌ పోశెట్టి, గోజూర్‌ గంగాధర్‌ తన కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు నాటి ఎస్సై రాఘవేందర్‌ కేసు నమోదు చేసి కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఏపీపీ రామకృష్ణ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితులపై నేరం రుజువు కావడంతో సదరు వ్యక్తులపై ఒకొక్కరికి రూ. పది వేలు చొప్పున విధిస్తూ జడ్జి దీప్తి జరిమానా విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు.

భిక్కనూరు: జాతీయ రహదారిపై బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలైన ఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో మంగళవారం వేకువజామున చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఈసీఎల్‌ ప్రాంతానికి చెందిన అనంత్‌(23), సంజన స్నేహితులు. వీరు సోమవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి వచ్చి మంగళవారం వేకువజామున తిరిగి హైదరాబాద్‌కు బైక్‌పై వెళ్తుండగా జంగంపల్లి శివారులోని జాతీయ రహదారిపై అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్నారు. ఈ ఘటనలో అనంత్‌ అక్కడికక్కడే మృతి చెందగా సంజనకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు సంజనను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, అనంత్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.

కరెంట్‌ షాక్‌తో యువకుడు..

సదాశివనగర్‌: షార్ట్‌ సర్క్యూట్‌తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన సదాశివనగర్‌ మండలం ఉత్తునూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై రంజిత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుడిసె సతీశ్‌(25) మంగళవారం ఉదయం పొలంలో మందు పిచికారీ చేసేందుకు వెళ్లాడు. పిచికారీ కోసం కావాల్సిన నీటిని తెచ్చేందుకు తన వ్యవసాయ బావిలోకి దిగాడు. బావిలో ఉన్న మోటర్‌ వైర్‌ తెగి నీటిలో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించని సతీశ్‌ నీటిని తీసుకుంటుండగా కరెంట్‌షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

చెరువులో పడి మహిళ..

పిట్లం: ప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళ మృతి చెందిన ఘటన పిట్లం మండలం కిష్టాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్నోళ్ల సత్యవ్వ(45) మంగళవారం ఉదయం 10 గంటలకు గ్రామ చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లింది. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోవడంతో నీట మునిగి మృతి చెందింది. భర్త బాలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

మద్నూర్‌: ట్రాక్టర్‌పై నుంచి పడి ఒకరు మృతి చెందిన ఘటన మద్నూర్‌ మండలం చిన్న ఎక్లార గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఇన్‌చార్జి ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం.. మద్నూర్‌ మండలం మేనూర్‌ గ్రామానికి చెందిన దశరథ్‌(25) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చిన్న ఎక్లార శివారులో ట్రాక్టర్‌పై మట్టిని తరలిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ట్రాక్టర్‌ వెనుక చక్రాలు అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

ఖలీల్‌వాడి: నగరంలో కోజ కాలనీలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం పీడీఎస్‌ బియాన్ని పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ సీఐ అంజయ్య ఆధ్వర్యంలో వన్‌ టౌన్‌ స్టేషన్‌ పరిధిలోని కోజ కాలనీలో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 75 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని అధికారులకు, వాహనాన్ని ఒకటో టౌన్‌ పోలీసులకు అప్పగించినట్లు సీఐ పేర్కొన్నారు. బొలెరో డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ఇసుక టిప్పర్‌..

బోధన్‌ టౌన్‌: మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు టిప్పర్‌ను పట్టుకున్నట్లు సీఐ వెంకటనారాయణ తెలిపారు. బోధన్‌ పట్టణంలోని బెల్లాల్‌ రైల్వేగేట్‌ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ టిప్పర్‌ను ఆపి పరిశీలించగా అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే టిప్పర్‌ను స్వాధీనం చేసుకొని డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

డిచ్‌పల్లి: గంజాయి అమ్మిన, కొనుగోలు చేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డిచ్‌పల్లి సీఐ మల్లేశ్‌ తెలిపారు. మంగళవారం డిచ్‌పల్లి సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై ఎండీ షరీఫ్‌తో కలిసి సీఐ మల్లేశ్‌ మాట్లాడారు. మంగళవారం ఉదయం ఎస్సై తన సిబ్బందితో పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా సీఎంసీ మెడికల్‌ కాలేజ్‌ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా కనిపించిన చిక్కలపల్లి శ్రీకాంత్‌, దర్బాషి నరేశ్‌ను తనిఖీ చేయగా వారి నుంచి 80 గ్రాముల గంజాయి లభించిందన్నారు. వారిని పీఎస్‌కు తరలించి విచారణ చేపట్టగా రూరల్‌ మండలం గుండారం శివారులోని రైస్‌మిల్‌లో పనిచేసే అరుణ్‌ సర్ధార్‌ వద్ద నుంచి వీటిని కొనుగోలు చేసినట్లు అంగీకరించారు. దీంతో అరుణ్‌ సర్ధార్‌ను పట్టుకుని విచారించగా అతడి వద్ద కూడా 60 గ్రాముల గంజాయి లభించిందన్నారు. ముగ్గురు నిందితుల నుంచి మొత్తం 140 గ్రాముల గంజాయి, మూడు సెల్‌ఫోన్లు, ఒక మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రసాద్‌, కానిస్టేబుల్‌ రాజేందర్‌ ఉన్నారు.

ట్రాక్టర్‌పై నుంచి పడి ఒకరి మృతి

మరొకరికి తీవ్రగాయాలు

గంజాయి కేసులో ముగ్గురి అరెస్ట్‌1
1/5

గంజాయి కేసులో ముగ్గురి అరెస్ట్‌

గంజాయి కేసులో ముగ్గురి అరెస్ట్‌2
2/5

గంజాయి కేసులో ముగ్గురి అరెస్ట్‌

గంజాయి కేసులో ముగ్గురి అరెస్ట్‌3
3/5

గంజాయి కేసులో ముగ్గురి అరెస్ట్‌

గంజాయి కేసులో ముగ్గురి అరెస్ట్‌4
4/5

గంజాయి కేసులో ముగ్గురి అరెస్ట్‌

గంజాయి కేసులో ముగ్గురి అరెస్ట్‌5
5/5

గంజాయి కేసులో ముగ్గురి అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement