మొదలైన అడ్మిషన్ల దందా
● నిబంధనలకు విరుద్ధంగా ప్రక్రియ
● రాజధానితోపాటు జిల్లాకు చెందిన ప్రైవేటు కళాశాలల పోటీ
● ప్రభుత్వ, ప్రైవేటు హెచ్ఎంలకు
విందులు
● ఆఫర్లు ప్రకటిస్తున్న పీఆర్వోలు
● అయోమయంలో తల్లిదండ్రులు
నిజామాబాద్అర్బన్: పదో తరగతి పరీక్షలు ముగియకముందే కార్పొరేట్ ‘దందా’ మొదలైంది. ‘మీ పిల్లలను మా కళాశాలలో చేర్పించండి’ అంటూ తల్లిదండ్రులకు గాలం వేస్తున్నాయి. విద్యార్థులు చ దివే పాఠశాలలకు వెళ్లి మరీ ప్రచారం చేస్తున్నాయి. హైదరాబాద్కు చెందిన బడా కార్పొరేట్ విద్యాసంస్థలతోపాటు జిల్లాకు చెందిన ప్రైవేటు కళాశాలలు సైతం ఈ తతంగాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రత్యేకంగా పీఆర్వోలను నియమించుకుని నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ల ప్రక్రియను చేపడుతున్నాయి.
విందులు, ఆఫర్లు
కార్పొరేట్ పీఆర్వోలు ప్రతిరోజు ప్రైవేట్ విద్యాసంస్థలతోపాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల హెచ్ఎంలను కలుస్తూ వారికి విందులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. తమ కళాశాలకు అడ్మిషన్లు ఇప్పించాలంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. చదువులో మెరుగ్గా ఉన్న విద్యార్థుల వివరాలను ముందే తీసుకొని హెచ్ఎంల ద్వారా తల్లిదండ్రులను కలుస్తున్నారు. ఇటీవల రెండు ప్రధాన ఉపాధ్యాయ సంఘాలకు హైదరాబాద్కు చెందిన ఓ కార్పొరేట్ విద్యా సంస్థ జిల్లా కేంద్రంతోపాటు రాజధానిలో రెండుసార్లు పె ద్ద ఎత్తున విందు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
నిబంధనలకు విరుద్ధంగా..
పరీక్షలు పూర్తయి, ఫలితాలు వెలువడిన తర్వాతే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కావాలి. నిబంధనల ప్రకారం మే, జూన్ నెలల్లో కళాశాలల్లో చేరికలు మొదలు పెట్టాల్సి ఉంటుంది. కానీ, అవేమీ పట్టించుకోని కార్పొరేట్ విద్యాసంస్థలు జనవరి నుంచే అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాయి. ఇదంతా నిబంధనలకు విరుద్ధమంటూ విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్మిషన్ల పర్వం మొదలుపెట్టినట్లు తెలిసినా సంబంధిత విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జగదీశ్రెడ్డి క్షమాపణలు చెపాల్సిందే
చర్యలు తీసుకుంటాం
నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేపట్టొద్దు. ప్రైవే టు కళాశాలల్లో ముందస్తు గా అడ్మిషన్లు చేపడుతున్న దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. అనుమతి లేని కళాశాలలపై తప్పకుండా చర్యలు ఉంటాయి.
– రవికుమార్, జిల్లా ఇంటర్ విద్యాధికారి
తిష్టవేసిన పీఆర్వోలు
కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన పీఆ ర్వోలు రెండు నెలల క్రితం నుంచే జిల్లాలో తిష్ట వే శారు. లాడ్జీల్లో ఉంటూ పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల పాఠశాలలకు వెళ్తూ తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను తీసుకుంటున్నారు. అనంతరం మెసేజ్ లు, వాయిస్ కాల్స్ చేయడంతోపాటు వాట్సాప్ ద్వారా ప్రచార పోస్టర్లను పంపుతూ అడ్మిషన్లు తీసుకునేలా మభ్యపెడుతున్నారు. జిల్లా కేంద్రంలోని కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు కూడా అడ్మిషన్ల కోసం ఇదే తంతు అవలంబిస్తున్నాయి. పరీక్షలు ప్రారంభంకాకముందే ఫోన్కాల్స్, ప్రచారంతో విసిగిస్తుండడంతో ఇటు తల్లిదండ్రులు, అటు విద్యార్థులు అయోమయంలో పడుతున్నారు.
విద్యార్థులకు కార్పొరేట్ గాలం