కర్నల్ తండాలో పొలంలో మేస్తున్న పశువులు
ధర్పల్లి : రైతులు ఎన్నో ఆశలతో సాగు చేసిన వరి పైర్లు నిట్టనిలువునా ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో పొట్ట దశకు వచ్చిన వందల ఎకరాల్లో వరి పొలాలు బీటలువారుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే ఎండిపోతుండడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వానాకాలంలో భారీ వర్షాలు కురవడంతో కుంటలు, చెరువులు నిండాయి. భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగి బోర్లు బాగా పోశాయి. దీంతో పంటలు పండుతాయనే నమ్మకంతో యాసంగిలో కూడా రైతులు ఎక్కువగా వరి సాగు చేశారు. కానీ, ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎత్తిపోవడంతో పొట్ట దశలో ఉన్న పంట ఎండిపోతోంది. బోర్లను నమ్ముకొని వరి వేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
అప్పులే మిగిలాయి
ఈ రైతు పేరు మహిపా ల్. ధర్పల్లి మండలం కర్నల్ తండా. యాసంగిలో మూడు ఎకరాల్లో వరి సాగు చేశాడు. పొట్ట దశకు వచ్చాక బోరు ఎత్తిపోయింది. దీంతో రూ. 1.20 లక్షలు వెచ్చించి 800 అ డుగుల బోరు బావి తవ్వించా డు. కొద్దిపాటి నీరు బయటకు రాగా పంటకు సరిపోతాయనే ఆశతో మరో రూ.1.40 లక్షలతో కొత్త పైపులు, కేబుల్తో మోటారు బిగించాడు. కానీ ఆ రైతు ఆశలు కొన్ని రోజుల్లోనే ఆవిరయ్యాయి. కొత్తగా తవ్వించిన బోరు నుంచి నీరు రాకపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయింది. దీంతో చేసేదేమీ లేక పంటలో పశువులను మేపుతున్నాడు.
నీరందక ఎండిపోతున్న పంటలు
అడుగంటుతున్న భూగర్భ జలాలు
లక్షల్లో అప్పులు చేసి బోరుబావుల తవ్వకం
జీవాల మేతగా ఎండిన పంటలు
ఆశల సాగు ఆవిరయ్యే..