కమ్మర్పల్లి: ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కృత్రి మ మేధ బోధనను ప్రవేశపెడుతోంది. విద్యార్థుల పఠనా సామర్థ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ కోర్సును ప్రాథమిక స్థాయి నుంచే ప్రారంభించేందుకు జిల్లాలో 44 పాఠశాలలను ప్రయోగాత్మకంగా ఎంపిక చేసింది. ఈ నెల 15 నుంచి కృత్రిమ మేధ ద్వారా బోధన ప్రారంభం కానుంది. ఈ మేరకు డీఈవో ఇప్పటికే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీచేశారు.
సర్వం సిద్ధం..
కృత్రిమ మేధతో విద్యా బోధన కోసం విద్యాశాఖ అధికారులు జిల్లాలో 44 ప్రాథమిక పాఠశాలలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. 1 నుంచి 5వ తరగతి వరకు సుమారు 3 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) విద్యనందించేందుకు ఒక్కో పాఠశాలలో 5 కంప్యూటర్లు, హెడ్ఫోన్స్, ఇంటర్నెట్ సదుపాయంతోపాటు అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలను అందుబాటులో ఉంచారు.
విద్యార్థుల స్థాయి మేరకు బోధన..
3, 4, 5వ తరగతుల విద్యార్థులు ఆశించిన స్థాయిలో అభ్యసనా సామర్థ్యాలు సాధించడానికి, గణితంలో చతుర్విద ప్రక్రియలు సులభంగా నేర్చుకోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. చిన్నారులను ఆకట్టుకునేలా రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్తో బోధిస్తారు. ఎంపిక చేసిన 3, 4, 5 తరగతుల విద్యార్థులు ఐదుగురిని ఒక బ్యాచ్గా ఏర్పాటు చేసి, ఒక్కో బ్యాచ్కు తెలుగు వాచకం, గణిత అభ్యాసాలపై 20 నిమిషాల వ్యవధిలో ఏఐ పాఠాలను బోధించనున్నామని విద్యాధికారులు తెలిపారు. విద్యార్థి అర్థం చేసుకుంటున్నాడా లేదా అని ఏఐ గుర్తించి.. అర్థం కాకపోతే సరళమైన మార్గంలో, అర్థం అయ్యిందంటే మరికొంత మెరుగైన పద్ధతిలో పాఠాలు బోధిస్తారు.
విద్యా ప్రగతికి దోహదపడుతుంది
ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం, కృత్రిమ మేధ ద్వారా తరగతులు నిర్వహించడంతో విద్యార్థుల అభ్యసనంలో ప్రగతికి దోహదపడుతుంది. విద్యార్థుల హాజరుశాతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. 2025–26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక పెరిగే ఆస్కారం ఉంటుంది.
– అశోక్, డీఈవో, నిజామాబాద్.
ప్రయోజనాలివే..
విద్యార్థుల వ్యక్తిగత అభ్యాసన శైలిని మెరుగుపరచడంలో సహాయపడనుంది.
విద్యార్థులకు తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకునే అవకాశం లభిస్తుంది.
విద్యార్థుల బలహీనతలను గుర్తించి, వారి సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు టీచర్లు ప్రత్యేక శిక్షణ అందిస్తారు.
ఏఐ టెక్నాలజీ సహాయంతో విద్యార్థులు నేర్చుకునే విధానాన్ని టీచర్లు విశ్లేషించి, వారికి తగిన మార్గదర్శకత ఇస్తారు.
నేటి నుంచి నూత్పల్లి పాఠశాలలో..
డొంకేశ్వర్(ఆర్మూర్): డొంకేశ్వర్ మండలంలోని నూత్పల్లి ప్రాథమిక పాఠశాలలో నేటి నుంచి కృత్రిమ మేధ(ఏఐ) ద్వారా బోధన అందించనున్నారు. అందుకోసం పక్కనే ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో కంప్యూటర్లను సిద్ధం చేశారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఏఐ ద్వారా బోధన శనివారం నుంచి ప్రారంభిస్తున్నట్లు ఎంఈవో రామకృష్ణ తెలిపారు. త్వరలోనే కంప్యూటర్ సౌకర్యాలున్న మిగతా పాఠశాలల్లో కూడా ఏఐ విద్యను అందుబాటులోకి తెస్తామన్నారు.
నేటి నుంచి 44 పాఠశాలల్లో శ్రీకారం
ప్రాథమిక స్థాయిలోనే డిజిటల్ నైపుణ్యం
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు