బోధన్: వందేళ్ల క్రితం నాటి నుంచి హోలీ సందర్భంగా హున్సా గ్రామంలో నిర్వహిస్తున్న పిడిగుద్దులాట ఆఖరికి ఆనవాయితీ ప్రకారం కొనసాగింది. పోలీసులు ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆట కొనసాగింపుపై సందిగ్ధత నెలకొనగా, ఆఖరుకు ప్రజాప్రతినిధులు, కుల సంఘాల పెద్దలు పోలీసులను ఒప్పించారు. దీంతో సాలూర మండలంలోని హున్సా గ్రామంలో శుక్రవారం ఉదయం నుంచి మ ధ్యాహ్నం వరకు ప్రజలు రంగులు చల్లుకుంటూ హోలీ జరుపుకున్నారు. సాయత్రం గ్రామ శివారు లో కుస్తీ పోటీలు నిర్వహించారు. అనంతరం గ్రా మంలోని హనుమాన్ ఆలయం వద్ద గ్రామస్తులు పి డిగుద్దులాటకు సిద్ధమయ్యారు. గ్రామ పెద్దలు కర్ర స్తంభాలు పాతి, బలమైన తాడును బిగించారు. తాడుకు ఇరువైపులా గ్రామస్తులు ఉండగా గ్రామ పెద్దల సూచన మేరకు ఆట మొదలు పెట్టారు. కుడిచేతితో తాడును పట్టుకుని ఎడమ చేతి పిడికిలితో ఒకొరినొకరు కొట్టుకున్నారు. పదినిమిషాల అనంతరం గ్రామపెద్దలు తాడును వదిలివేయడం ఆట ముగిసింది. అనంతరం ఇరువైపుల వారు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రూరల్ సీఐ విజయబాబు, ఎస్సై మచ్చేందర్ రెడ్డి పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు.
హున్సాలో పిడిగుద్దులాట