బాల్కొండ: మండల కేంద్రంలో బాల్కొండ నియోజకవర్గ స్థాయి పశువుల వ్యాధుల నివారణ–పరిశోధన కేంద్రం నిర్మించి పదేళ్లు అవుతోంది. అయినా ఇప్పటివరకు సిబ్బందిని నియమించకపోవడంతో ఇక్కడ ఎలాంటి పరిశోధన చేపట్టలేదు. దీంతో పరిశోధన కేంద్రం నిరుపయోగంగా మారింది. పశువుల మూగ వేదన పాలకులకు, ఉన్నత అధికారులకు అర్థం కావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు స్పందించి పరిశోధన కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని పాడి రైతులు కోరుతున్నారు. అలాగే బాల్కొండ పశు వైద్యశాలలో గత రెండేళ్లుగా ఇన్చార్జి వైద్యుడే సేవలు అందిస్తున్నాడు. కనీసం పూర్తి స్థాయిలో వైద్యుడిని నియమించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం..
మండల కేంద్రంలోని నియోజకవర్గ స్థాయి పశు వ్యాధుల నివారణ–పరిశోధన కేంద్రం గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ప్రభుత్వం సిబ్బందిని నియమిస్తే కేంద్రంలో పరిశోధనలు చేపట్టవచ్చు. – గౌతంరాజు,
ఇన్చార్జి పశు వైద్యుడు, బాల్కొండ