ఎల్లారెడ్డి: వృద్ధురాలి మెడలో నుంచి బంగారం చోరీ చేసిన కేసులో నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ రవీందర్నాయక్ తెలిపా రు. స్థానిక పీఎస్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో సీఐ మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లికి చెందిన కాశవ్వ అనే వృద్ధురాలు ఈనెల 9న ఎల్లారెడ్డికి వారాంతపు సంతకు వచ్చింది. స్వగ్రామానికి వెళ్లేందుకు స్థానిక పెట్రోల్ బంక్ వద్ద ఆటో కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఎల్లారెడ్డికి చెందిన ఏసవ్వ వృద్ధురాలితో మాటాలు కలిపింది. తాను కూడా అటు వైపే వెళ్తున్నానని అంబేడ్కర్ చౌరస్తా వద్ద తక్కువ రేటుకు ఆటోలు వస్తాయని చెప్పి చర్చి కాంపౌండ్ సమీపంలోని నిర్మాణుష్య ప్రదేశానికి తీసుకెళ్లింది. అక్కడ కాశవ్వ కంట్లో కారంపొడి చల్లి ఆమె మెడలో ఉన్న రెండు తులాల గుండ్లు, రెండున్నర తులాల పుస్తెల తాడును ఎత్తుకెళ్లింది. మరుసటి రోజు కాశవ్వ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బుధవారం గాంధీచౌక్ ప్రాంతంలో ఏసవ్వ అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను పట్టుకున్నారు. బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు ఏసవ్వ ఒప్పుకోవడంతో ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై మహేశ్, సిబ్బంది అనిల్గౌడ్, అర్చన తదితరులు పాల్గొన్నారు.