వాహనం ఢీకొని జింక మృతి | - | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని జింక మృతి

Mar 13 2025 11:35 AM | Updated on Mar 13 2025 11:30 AM

బోధన్‌రూరల్‌: బోధన్‌ మండలం రాంపూర్‌, కల్దుర్కి రాజన్న చౌరస్తా వద్ద బుధవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు బోధన్‌ రూరల్‌ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోలీసు సిబ్బంది జింకకు నీరు తాగించినా కోలుకోలేదని, కొద్ది సేపటికి మృతి చెందిందని స్థానికులు తెలిపారు. పోలీసులు ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందించారు.

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

కమ్మర్‌పల్లి: మండల పరిధిలోని గాంధీనగర్‌లో పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై అనిల్‌రెడ్డి బుధవారం తెలిపారు. కడమంచి రవి అనే వ్యక్తి ఓ వాహనంలో రేషన్‌ బియ్యాన్ని నిల్వ చేశాడనే సమా చారం మేరకు స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దా డి చేసి పట్టుకున్నారు. పట్టుకున్న బియ్యం మూడు టన్నులు ఉంటుందని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

డ్రంకన్‌ డ్రైవ్‌లో నలుగురికి జైలు

ఖలీల్‌వాడి: డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ నలుగురికి రెండు రోజుల జైలు శిక్షను సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ నూర్జహాన్‌ విధించినట్లు ట్రాఫిక్‌ సీఐ ప్రసాద్‌ బుధవారం తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో మద్యం సేవించి నడిపిన 17 మందిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వీరికి నగరంలోని ట్రాఫిక్‌ పీఎస్‌లో కౌన్సెలింగ్‌ ఇచ్చి జడ్జి ఎదుట హాజరుపర్చినట్లు తెలిపారు. జడ్జి నలుగురికి రెండు రోజుల జైలు శిక్షను, 13 మందికి జరిమానా విధించినట్లు వెల్లడించారు.

బైక్‌ దహనం

ఎడపల్లి: మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున ఓ బైక్‌ను దుండగులు దహనం చేసినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. ఎడపల్లికి చెందిన చింటు తన బైక్‌ను తన ఇంటి ఎదుట నిలిపి నిద్రించాడు. ఉదయం 3 గంటల ప్రాంతంలో దుండగులు బైక్‌కు నిప్పంటించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement