
● పోడు భూముల కోసం మూడు
తరాలుగా పోరాడుతున్న రైతులు
● 412 ఎకరాల్లో ఏళ్లుగా
సాగుచేస్తున్న వైనం
● కొత్త సర్కార్పైనే రైతుల ఆశలు
రామారెడ్డి: ముత్తాతలు బావులు తవ్వి రాట్లతో.. తాతలు బావుల నుంచి గిరిటా తెంపుతో.. కొడుకులు బోరు బావులతో మూడు తరాలుగా సింగరాయపల్లిలోని రైతులు ప్రభుత్వ భూమిలో పంటలు పండిస్తూ జీవిస్తున్నారు. గ్రామానికి చెందిన 382 ఎకరాల ప్రభుత్వ భూమిలో 200 కుటుంబాలు పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నాయి. దీనికి తోడు ఇసాయిపేట శివారులోని సర్వే నంబర్ 414లో మరో 30 ఎకరాలలో సాగుచేసుకుంటున్న రైతులకు అటవీశాఖ నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సర్వే నంబర్ 29లో 382 ఎకరాలకు రెవెన్యూ అధికారులు వారసత్వ సంపదగా వచ్చాయని సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. 29 సర్వే నంబర్కు సంబంధించి గత బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన డిజిటల్ పాస్ పుస్తకం, మూడుసార్లు రైతుబంధుతో పాటు, రైతు బీమా, సబ్సిడీ విత్తనాలు, బ్యాంకు రుణాలు రైతులకు అందాయి. ఇలా మూడు తరాలుగా సాఫీగా సాగుతున్న సింగరాయపల్లి గ్రామంలోని 170 కుటుంబాల రైతుల బతుకుల్లో రెవెన్యూ శాఖ బాంబు పేల్చింది. అప్పటి నుంచి వారిని వెంటాడుతున్నాయి. ఇక 414 సర్వే నంబర్లో ఏళ్లుగా 30 ఎకరాల సాగు భూమి ఇసాయిపేట శివారులోని సింగరాయపల్లి రైతులు సాగు చేసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా అటవీశాఖ అధికారుల తీరుతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన పాల్వంచ మండలం సింగరాయపల్లి గ్రామంలో 29 సర్వే నంబర్లో 382 ఎకరాల భూమి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనూ డిజిటల్ పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. ఈ సర్వే నంబర్లోని 382 ఎకరాలలో ఎక్కువగా బావులున్నాయి. బావుల్లో పుష్కలంగా నీరు ఉండడంతో రైతులు వరి సాగు చేస్తున్నారు. కానీ 2017లో ఈ భూమి ఫారెస్ట్ భూమి కాగితాలుగా మారాయి. ఇక 414 సర్వేలోని 30 ఎకరాల సాగు భూమి ఇసాయిపేట శివారులో సింగరాయపల్లి గ్రామానికి చెందిన 60 కుటుంబానికి ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 414 సర్వే నంబర్కు పట్టాలిచ్చిన నాటి సర్కార్ తెలంగాణలో డిజిటల్ పట్టాలివ్వకపోవడంతో పాటు అటవీ శాఖ అధికారుల నుంచి ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు.
ఆ భూమి ఊరికి జీవనాధారం..
సింగరాయపల్లి గ్రామంలో 371 కుటుంబాలు ఉండగా 1308 జనాభా ఉంది. సర్వే నంబర్ 29లోని 382 ఎకరాలలో వ్యవసాయమే ఊరిలోని 70 శాతం జనాభాకు జీవనాధారం. ప్రస్తుతం 382 ఎకరాలలో 170 కుటుంబాలు వ్యవసాయం చేస్తూ బతుకు బండి లాగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త ఇచ్చిన పాటాపాస్ పుస్తకం ఉన్న అర్హత కల్గిన ఐదుగురు రైతులు చనిపోయిన రైతుబీమా వర్తించలేదు. పంటల నమోదు కూడా వ్యవసాయాధికారులు చేయడం లేదు.
దీంతో ఆ భూములో పండించిన పంటలను కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవడం సాధ్యం కావడం లేదు. తప్పని సారి పరిస్థితుల్లో ధా న్యాన్ని దళారులకే విక్రయిస్తున్న నష్టపోతున్నారు.
కొత్త సర్కార్పై గంపెడు ఆశలు..
పోడు సమస్యను కాంగ్రెస్ సర్కార్ పరిష్కరిస్తుందని సింగరాయపల్లి రైతులు ఆశగా ఉన్నారు. పోడు సమస్యను పరిష్కరిస్తామని ఎన్నికల వేళ హామి ఇవ్వడం ఇప్పడు రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో తమ సమస్య పరిష్కారమవుతుందని ఆశతో ఎదురుచూస్తున్నారు.
రైతు బీమా రాలేదు
గత ప్రభుత్వం కొత్త పాస్ పుస్తకం ఇచ్చింది. మూడు సార్లు రైతుబంధు డబ్బులు ఇచ్చారు. కానీ భర్త నర్సింహులు పేరు మీద సర్వే నంబర్ 29లో భూమి ఉంది. రైతు బీమాకు అర్హత ఉన్నా భూములను తొలగించామని ఇవ్వలేదు. కాంగ్రెస్ సర్కార్ పట్టాలివ్వాలి. – ఎల్లవ్వ, రైతు, సింగరాయపల్లి
