భైంసాటౌన్: వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధిలో పంట ఉత్పత్తుల కొనుగోలు కోసం నూతనంగా తెచ్చిన ఈనామ్ 2.0ను సమర్థవంతంగా అమలు చేయాలని మార్కెటింగ్ శాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి అన్నారు. పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఈనామ్ 2.0 అమలు తీరును పరిశీలించారు. ఏప్రిల్ 1 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు, ట్రేడర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అనంతరం భోకర్ చౌరస్తాలో ఏఎంసీ చెక్పోస్టును సందర్శించారు. 161బీబీ హైవే పనుల్లో భాగంగా చెక్పోస్టు గది ఎత్తివేయడంతో, మరోచోట స్థలం చూసి ఏర్పాటు చేయాలని సూచించారు. ఆమె వెంట ఏఎంసీ ఉన్నతశ్రేణి కార్యదర్శి పూర్యానాయక్, సిబ్బంది ఉన్నారు.


