బాసర : బాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఇన్చార్జి ఈవో విజయరామారావు. ఏఈవో గంగ శ్రీనివాస్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి నేపథ్యంలో క్యూలైన్లలో భక్తులకు తాగునీరు అందించారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో వివిధ పాఠశాలల విద్యార్థులు అమ్మవారిని దర్శించుకున్నారు. పరీక్ష ప్యాడ్లు, హాల్ టికెట్లు, పెన్నులు అమ్మవారి సన్నిధిలో ఉంచి పూజలు చేయించారు. వెయ్యి రూపాయల ప్రత్యేక అక్షరాభ్యాసం 613, రూ.150 సాధారణ అక్షరాభ్యాసం 331, చండీహోమం, అభిషేక లడ్డూ, మహా ప్రసాదం, పులిహోర, మండప ప్రవేశం, అష్టోత్తర కుంకుమార్చన ద్వారా ఆలయానికి రూ.13,69,090 ఆదాయం సమకూరినట్లు ఇన్చార్జి ఈవో తెలిపారు.


