సర్వైకల్ క్యాన్సర్ నుంచి కాపాడేందుకు హెచ్పీవీ.. 14 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలకు ఉచితంగా పంపిణీ జిల్లావ్యాప్తంగా 7,684 మంది అర్హులు నేటి నుంచి ప్రారంభం
తల్లిదండ్రుల అనుమతితోనే..
తల్లిదండ్రుల అనుమతితోనే హెచ్పీవీ టీకా వేస్తాం. జిల్లాలో హెచ్పీవీ వ్యాక్సిన్ను ఈనెల 8 (నేటి) నుంచి పంపిణీ చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశాాం. మొదట జీజీహెచ్ సీహెచ్ సీలో ప్రారంభించి తర్వాత పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధి లోని 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు చేస్తాం. వైద్యుల పర్యవేక్షణలోనే టీకాల పంపిణీ కొనసాగుతుంది.
– డాక్టర్ రాజేందర్, డీఎంహెచ్వో
నిర్మల్చైన్గేట్: మహిళల ఆరోగ్యాన్ని కబళిస్తున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్(సర్వైకల్ క్యాన్సర్)ను నియంత్రించేందుకు కేంద్రం హెచ్పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సిన్ను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ టీకాను 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు ఇస్తే లక్ష్యం నెరవేరేలా పని చేస్తుందని వైద్య నిపుణులు నిర్ధారించారు. ప్రధాని మోదీ జాతీయస్థాయిలో రాజస్థాన్లో టీకా పంపిణీని ఫిబ్రవరి 28న ప్రారంభించారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్లోని కింగ్ కోఠి ఆస్పత్రిలో ప్రారంభించారు. ఉమెన్స్ డే సందర్భంగా జిల్లాలో ఆదివారం నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
90 రోజుల కార్యక్రమం..
వ్యాక్సిన్ స్టాక్ రావడంతో ఆదివారం నుంచే వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఇది 90 రోజుల కార్యక్రమం. ఇప్పటికే ఆరోగ్యశాఖ 14–15 ఏళ్లలోపు బాలికలు జిల్లాలో 7,684 మంది ఉన్నట్లు గుర్తించింది. మొదట నెల రోజులు జిల్లా జనరల్ ఆస్పత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో బాలికలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత జిల్లావ్యాప్తంగా ఉన్న 18 పీహెచ్సీలలో వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పీహెచ్సీల వైద్యాధికారులు, ఎంఎల్హెచ్పీలు, ఫార్మాసిస్టులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, ల్యాబ్ టెక్నీషియన్లకు హెచ్పీవి వ్యాక్సిన్ ఇచ్చే విధానంపై శిక్షణ ఇచ్చారు.
వ్యాక్సిన్తో ఉపయోగాలు..
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తోపాటు నోరు, గొంతు, రొమ్ము క్యాన్సర్లను ఈ టీకా సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఆడపిల్లల్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకముందే టీకా తీసుకోవడంతో సంబంధిత క్యాన్సర్ను ఎదుర్కొనేందుకు కావాల్సిన రోగ నిరోధక శక్తి ఉత్పన్నమవుతుంది. సుమారు రూ.5 వేల ఖరీదు ఉండే ఈ టీకాను భారత ప్రభుత్వం ఆడపిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఉచితంగా పంపిణీ చేస్తోంది.


