జిల్లా కేంద్రంలో ఉద్యానవనాలకు స్థలం కరువు చారిత్రక ప్రదేశాల చెంత.. ఆహ్లాదం పెంచేలా.. పార్కుల ఏర్పాటుకు బల్దియా ప్రతిపాదనలు నిర్మల్ మ్యూజియం ఏర్పాటుకూ చర్యలు
ఆహ్లాదం చింత
నిర్మల్: జిల్లా ఏర్పడి పదేళ్లవుతోంది. కానీ.. ఇప్పటికీ జిల్లాలో ఒక్క టూరిజం స్పాట్ను అభివృద్ధి చేయలేదు. చూసేందుకు ఎన్నో ఆకట్టుకునే ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు ఉన్నా కనీస సదుపాయాలు, వసతులు లేకపోవడంతో జిల్లావాసులు, పర్యాటకులు అటువైపు వెళ్లడం లేదు. జిల్లా కేంద్రంలో ఒక్క పార్కు కూడా లేదు. శివారులో ఉన్న గండిరామన్న హరితవనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఈనేపథ్యంలో ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో చాలామంది ఓటర్లు తమకు మౌలిక వసతులతోపాటు కాసింత ఆహ్లాదాన్నీ అందించే పార్కులు ఏర్పాటు చేయాలని అభ్యర్థులను కోరారు. ఈమేరకు కొత్త మున్సిపల్ పాలకవర్గం జిల్లాకేంద్రంలో చారిత్రక ప్రదేశాల చెంతనే పార్కులు అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
కాంక్రీట్ జంగల్లో అవసరం..
పట్టణాలు రోజురోజుకూ విస్తరణతో కాంక్రీట్ అడవుల్లా తయారవుతున్నాయి. రోడ్లు, షాపింగ్ మా ల్స్, అపార్ట్మెంట్లు, పెద్దపెద్ద భవనాలు పెరుగుతు న్నా.. ప్రజలకు ప్రశాంతతనిచ్చే పచ్చని ప్రదేశాలు మాత్రం కరువవుతున్నాయి. కనీసం ప్రశాంతంగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే పరిస్థితి లేకుండా పో తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్కులు నగర జీవనానికి ఊపిరిలా మారాయి. పచ్చదనం మధ్య గడి పే కాసింత సమయం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మొబైల్ ఫోన్లు, టీవీలకు పరిమితమవుతున్న పిల్లలకు పార్కులు ఆడుకునే స్వేచ్ఛను ఇస్తాయి.
త్వరలోనే ఏర్పాటు చేసేలా..
జిల్లా కేంద్రమైన తర్వాత ఇక్కడ జనాభా పెరగడంతోపాటు ఆహ్లాదకర వాతావరణం కనుమరుగైంది. ప్రజల నుంచి పార్కుల ఏర్పాటు డిమాండ్ పెరుగుతోంది. ఈమేరకు చారిత్రక కట్టడాల వద్ద పార్కులు ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు చేస్తున్నాం. త్వరలోనే పురావస్తుశాఖ అధికారులతోపాటు జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలుస్తాం.
‘చరిత్ర’ను కాపాడేలా..
పట్టణవాసుల నుంచి పెరుగుతున్న డిమాండ్ మేరకు నిర్మల్ పురపాలకవర్గం వినూత్న ప్రతిపాదన తీసుకువచ్చింది. నిర్మల్ చారిత్రక ప్రాంతం కావడంతో ఇప్పటికీ ఇక్కడ పదుల సంఖ్యలో బురుజులు, గఢ్లు, కట్టడాలు ఉన్నాయి. పార్కుల నిర్మాణం కోసం స్థలం లేనందున ఇలాంటి చారిత్రక ప్రాంతాల వద్దనే పచ్చదనం పెంచి, పార్కులను అభివృద్ధి చేయాలన్న యోచిస్తోంది. వీటివల్ల సదరు చారిత్రక ప్రాంతాలు ఆక్రమణలకు గురికాకుండా ఉండటంతోపాటు ముందుతరాలకు నిర్మల్ చరిత్ర తెలుసుకోవడానికీ అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు. హిస్టారికల్ పార్కుల కోసం నిజామాబాద్ రోడ్డులో గల శ్యాంగఢ్, కలెక్టరేట్ రోడ్డులో గల బత్తీస్గఢ్, పట్టణ పోలీస్స్టేషన్ ఎదుటగల ఖిల్లాగుట్ట తదితర ప్రాంతాలను త్వరలోనే పరిశీలిస్తామంటున్నారు. అలాగే జిల్లాకేంద్రంలో పురాతన వస్తుసంపద, చారిత్రక అంశాలతో ఓ మ్యూజియంనూ ఏర్పాటు చేయనున్నారు.


